1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 మే 2022 (08:35 IST)

తెల్లారితే పెళ్ళి - వేధింపులు భరించలేక వధువు ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. తెల్లారితే వివాహం కావాల్సిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో పెళ్ళి బాజాభజంత్రీలు మోగాల్సిన ఇంటి చావుడబ్బులు మోగుతున్నాయి. దీనికి కారణం ఓ యువకుడు వేధింపులు. ఈ కామాంధుడి వేధింపులు భరించలేని ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. 
 
పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని మక్తల్ పరిధిలో ఉన్న చందాపూర్ అనే గ్రామానికి చెందిన భూమేశ్వరి (19) అనే యువతికి దండు గ్రామానికి చెందిన యువకుడితో పది రోజుల క్రితం పెళ్లి నిశ్చితార్థం జరిగింది. మంగళవారం ఉదయం వివాహం జరగాల్సివుంది. 
 
ఇరు కుటుంబాలు ఈ పెళ్లి ఏర్పాట్లను ఘనంగా చేశారు. ఇంతలోనే వధువు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. సోమవారం తెల్లవారుజామున భీమేశ్వరి తన ఇంట్లోనే చున్నీతో ఉరిబిగించుకుని ప్రాణాలు తీసుకుంది. కుమార్తె విగతజీవిగా మారడాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు గుండెలు అలసిపోయేలా రోదించారు. 
 
తనకు నిశ్చితార్థం అయినట్టు తెలిసినా చందాపూర్‌కే చెందిన లిక్కి అలియాస్ సిరిపి నర్సింహులు ప్రేమ పేరుతో నిత్యం వేధిస్తున్నారని, అతని వేధింపులు భరించలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసూడై నోట్ రాసిపెట్టింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.