1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 30 డిశెంబరు 2015 (12:39 IST)

ధాన్యాల్లో రారాజు రాగులు.. రాగిపిండి పదార్థాలు బలవర్ధకమైన ఆహారం!

ధాన్యాలలో రారాజు రాగులు. రాగి సంగటి అనగానే గుర్తొచ్చేది పల్లెటూరు. ఒకప్పుడు దీనిని పొద్దున్నే జావగా చేసి పాలల్లో, మజ్జిగలో కలుపుకుని తాగేవారు. ఆరోగ్యానికి రాగులు ఎంతో మంచిది. ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నవారు రాగితో చేసిన జావ తాగితే చలువ చేస్తుంది. రాగి జావ, రాగి సంగటి రాగులతో చేసిన ఇతర ఆహార పదార్థాల వల్ల శరీరానికి అంత బలం చేకూరుతుంది. రాగిపిండి పదార్థాల వల్ల మన శరీరానికి కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందామా..!
 
రాగుల వల్ల జుట్టు వత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. రాగులు ఇతర ధాన్యాలకంటే బలవర్థకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది.
 
రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి త్రాగించినట్లయితే వారి ఎదుగుదల, ఆరోగ్యం బాగుండి శక్తి లభిస్తుంది. మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది.  రాగి మాల్టును తీసుకుంటే రక్తపోటు అరికట్టబడుతుంది.
 
కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది. రాగుల పానీయం దప్పిక తీరుస్తుంది. వృద్ధాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి.