శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (17:12 IST)

కరోనా వైరస్ సోకిన గంటల వ్యవధిలోనే లక్షణాలు...

సాధారణంగా కరోనా వైరస్ సోకితే 14 రోజుల తర్వాతే దాని లక్షణాలు బహిర్గతమవుతాయన్నది ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న వాదన. కానీ, ఈఎన్‌టి వైద్యులు మాత్రం సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఈ వైరస్ సోకిన గంటల వ్యవధిలోనే దాని లక్షణాలను బయటపడతాయని చెబుతున్నారు. ముఖ్యంగా, రుచి తెలియకపోవడం, వాసనను పసిగట్టలేకపోవడం అనేది తక్షణం కనిపిస్తాయని పేర్కొంటున్నారు. 
 
నిజానికి కరోనా వైరస్ సోకిన వ్యక్తికి 14 రోజుల్లోగా జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ లక్షణాలన్నీ ఒకేసారి కనిపిస్తే, వారికి కరోనా సోకినట్టుగా అనుమానించవచ్చని ప్రపంచ ఆరోగ్య నిపుణులు ఇప్పటికే తేల్చి చెప్పారు. 
 
అయితే, ఈ లక్షణాలు బయటకు తెలిసే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. వైరస్ సోకిన వారి నుంచి ఎంతో మందికి వైరస్ వ్యాపిస్తుంది. కానీ, బ్రిటన్ ఈఎన్టీ వైద్యుల పరిశోధన మేరకు శరీరంలోకి వైరస్ ప్రవేశించిన గంటల్లోనే రెండు కొత్త లక్షణాలు బయటకు వస్తాయని గుర్తించారు. 
 
ఈ వైరస్‌ సోకినవారు తొలుత వాసనను గుర్తించలేరని, ఆపై తినే ఆహార పదార్థాల రుచిని కూడా కోల్పోతారని వెల్లడించారు. వైరస్ ఊపిరితిత్తుల్లోకి చేరడానికి ముందు ముక్కులో ఆగుతుందని, అందువల్ల వాసన చూసే సామర్థ్యం పోతుందని తెలిపారు. 
 
ఇక ఈ లక్షణాలు కనిపిస్తే, రోగ నిరోధక శక్తి అధికంగా ఉండే యువత వైరస్ బారిన పడినప్పటికీ అన్ని లక్షణాలూ బయటపడేలోపే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు. 
 
హఠాత్తుగా తాము వాసన పసిగట్టే సామర్థ్యాన్ని కోల్పోయామంటూ తన క్లినిక్‌‌కు వచ్చే రోగుల సంఖ్య ఇటీవలికాలంలో గణనీయంగా పెరిగిందని, కారణం కనుక్కునే ప్రయత్నాల్లో తానుండగా, వారిలో ఎక్కువ మందికి కరోనా సోకినట్టు తెలిసిందని బ్రిటన్‌ ఈఎన్‌టీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ నిర్మల్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.