మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2020 (09:48 IST)

విధ్వంసకర బ్యాట్స్‌మెన్ల వికెట్లు తీయకుంటే ఓటమే.. మళ్లీ పుంజుకుంటాం : కేఎల్ రాహుల్

ఏ జట్టుకైనా విధ్వంసకర ఆటగాళ్ల వికెట్లు తీయకుంటే ఓటమి తప్పదని పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ టోర్నీలోభాగంగా ఆదివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ నిర్ధేశించిన 178 పరుగుల విజయలక్ష్యాన్ని చెన్నై జట్టు ఓపెనర్లే బాదేశారు. ఫలితంగా పది వికెట్ల తేడాతో విజయభేరీ మోగించి, తన ఖాతాలో ఐపీఎల్ టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. 
 
ఈ ఓటమిపై పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందిస్తూ, తాము ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసునని, మరింత బలంగా పుంజుకుంటేనే అవకాశాలు లభిస్తాయని అన్నాడు. ముఖ్యంగా, ఆదివారంనాటి మ్యాచ్‌లో తాము కనీసం ఒక్క వికెట్‌ను కూడా తీయలేకపోయామని, తమ ప్లాన్‌ను అమలు చేయడంలో విఫలం అయ్యామని, విధ్వంసకర ఆటగాళ్లయిన షేన్ వాట్సన్, డూప్లెసిస్ వికెట్లు తీయకుంటే, ఏ జట్టుకు అయినా చిక్కులే మిగులుతాయని అన్నారు. 
 
వరుసగా ఓడిపోవడం బాధను కలిగిస్తోందని, తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడం కష్టమేమీ కాదని అన్నాడు. తొలుత తాము బ్యాటింగ్ చేస్తున్న వేళ, పిచ్ నెమ్మదిగా ఉందని, సమయం గడిచే కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలించిందని కేఎల్ రాహుల్ అన్నాడు. తమ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారని, వారంతా తిరిగి పుంజుకుంటే, తమ జట్టు కూడా గెలుపు బాట పడుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.