శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (23:24 IST)

ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ చిత్తు... హైదరాబాద్‌ను ఆదుకున్న విలియమ్సన్ - హోల్డర్

యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. శుక్రవారం రాత్రి జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాదు ఆరంభంలో కష్టాల్లో పడింది. రాయల్ చాలెంజర్స్‌పై ఏమంత కష్టసాధ్యంకాని లక్ష్యంతో బరిలో దిగిన సన్ రైజర్స్ అనూహ్యంగా ఒత్తిడికి గురైంది. 
 
ఆ ఒత్తిడి ఫలితమే 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. మామూలుగా అయితే 132 పరుగుల టార్గెట్ ఏమంత పెద్దది కాదు. కానీ ఇది ఎలిమినేటర్ మ్యాచ్ కావడంతో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. దాంతో స్వల్ప లక్ష్యఛేదనలోనూ సన్ రైజర్స్ బ్యాట్స్‌మెన్ తమ సహజసిద్ధ ఆటతీరు కనబర్చలేకపోయారు. 
 
132 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టులో ఓపెనర్ గోస్వామి డకౌట్ కాగా, మరో ఓపెనర్ కెప్టెన్ వార్నర్ 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మనీష్ పాండే సైతం 24 పరుగులు చేసి జంపా బౌలింగులో అవుటయ్యాడు. ఈ టోర్నీ ఆసాంతం పేలవఫామ్‌తో ఉన్న ప్రియమ్ గార్గ్ (7) ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. మరోసారి స్వల్పస్కోరుకు వెనుదిరిగాడు.
 
అయితే, కేన్ విలియమ్సన్ అర్థ సెంచరీ (44 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 50 నాటౌట్), జాసన్ హోల్డర్‌ 20 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 20 పరుగులు చేసి జట్టును గట్టెక్కించారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.
 
ఫలితంగా 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న హైదరాబాద్ జట్టును వీరద్దరూ ఆదుకున్నారు. ఫలితంగా 19.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేయగా, ఆరు వికెట్ల తేడాతో గెలుపొందారు. బెంగుళూరు బౌలర్లలో సిరాజ్ 2, జంపా, చహల్ చెరో వికెట్ తీశారు. 
 
మరోవైపు, బెంగళూరు జట్టులో నాలుగు మార్పులు జరిగాయి. క్రిస్ మోరిస్ గాయం కారణంగా తప్పుకున్నాడు. పెద్దగా రాణించని జోష్ ఫిలిప్పే, షాబాజ్ అహ్మద్ లను పక్కనబెట్టారు. ఇసురు ఉదనకు తుది జట్టులో స్థానం లభించలేదు. ఆరోన్ ఫించ్, ఆడమ్ జంపా, నవదీప్ సైనీ, మొయిన్ అలీ జట్టులోకొచ్చారు. 'ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇక ఇంటికే' అన్న నేపథ్యంలో ఇరుజట్లు హోరాహోరీగా పోరాడాయి.
 
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ జట్టు మ్యాచ్ ఆద్యంతం పేలవ ప్రదర్శన కొనసాగించింది. ముఖ్యంగా, ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. మరో ఓపెనర్ పడిక్కల్ కూడా కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. దీంతో 3.3 ఓవర్లలో 15 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన ఆర్సీబీ... ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేక పోయింది. 
 
మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు అరోన్ ఫించ్ 32, డీ విలియమ్స్ 56 చొప్పున పరుగులు చేశారు. వీరిద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లంతా అటొచ్చి ఇటెళ్ళిపోయారు. అలీ డకౌట్ కాగా, దుబే 8, సుందర్ 5, షైనీ 9, సిరాజ్ 10 చొప్పున పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.