శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 మే 2020 (19:14 IST)

సీన్ మారింది.. వీవో స్మార్ట్‌ఫోన్ బాక్సులపై 'మేక్ ఇన్ ఇండియా'

సీన్ మారింది. అవును. అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ వివో తన లోగో డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసింది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల తయారీకి మద్దతుగా దేశంలో వివో విక్రయించే అన్ని స్మార్ట్ ఫోన్ల బాక్సులపై ఇక నుంచి మేక్ ఇన్ ఇండియా అని కనిపించనుంది.

మొబైల్‌ పరికరాల తయారీ కోసం భారత్‌లో సుమారు 7500కోట్ల పెట్టుబడులు పెట్టాలని గత ఏడాదే వివో నిర్ణయించిన సంగతి తెలిసిందే. భారత్‌లో విక్రయించే ప్రతి వివో ఫోన్‌ కూడా నోయిడాలోని వివో ఫ్యాక్టరీలోనే తయారవుతున్న సంగతి విదితమే.
 
దీనిపై వివో ఇండియా ట్వీట్ చేస్తూ.. ఆత్మనిర్భర్ భారత్‌కు తాము మద్దతిస్తున్నట్లు తెలిపింది. తమ కంపెనీ మేక్ ఇండియా నిబద్ధతకు జీవం పోస్తూ.. ముంబైకి చెందిన రాహుల్‌ పటేల్‌ రూపొందించిన లోగోను రాబోయే అన్ని డివైజ్‌లపై ముద్రిస్తామని వెల్లడించింది. ప్రతి వివో పరికరం భారత్‌లోనే తయారవుతుందనే వాస్తవాన్ని దీని ద్వారా నొక్కి చెప్పాలనుకుంటున్నామని వివో ఇండియా ట్విటర్లో పేర్కొంది.
 
మరోవైపు.. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ 'వివో' త్వరలో వివో X50 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేయనున్నట్లు ప్రకటించింది. మొదటగా చైనాలోనే కొత్త ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. జూన్‌ 1న లాంచింగ్‌ ఈవెంట్‌లో 5జీ ఫోన్‌ను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించింది. వైబోలో ఫోన్‌ విడుదలకు సంబంధించిన విషయాలను షేర్‌ చేసింది. త్వరలోనే భారత మార్కెట్లో కూడా దీన్ని లాంచ్‌ చేయనుందని అంచనా.