1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (16:19 IST)

సోమవారం నలుగురు.. మంగళవారం 18 మంది.. ఎంపీ సస్పెన్షన్

mp's agitation
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ దఫా వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో జీఎస్టీ పన్ను పెంపుదలపై విపక్ష పార్టీలు భారీ స్థాయిలో ఆందోళనకు దిగుతున్నాయి. అదేసమయంలో ఇరు సభల స్పీకర్లు కూడా కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఇందులోభాగంగా, సోమవారరం సభా కార్యక్రమాలకు అడ్డు తగిలినందుకు నలుగురు కాంగ్రెస్ ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆదేశాలు జారీచేశారు.
 
మంగళవారం జీఎస్టీ పన్నును తగ్గించాలని కోరుతూ రాజ్యసభలో ఆందోళనకు దిగిన 18 మంది విపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెల్సిందే.
 
అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ విధానాలు, జీఎస్టీ పన్ను పెంపు తదితర ప్రజా సమస్యలపై విపక్షాలు వాయిదా తీర్మాన నోటీసులను ఇస్తూ వస్తున్నాయి. కానీ, వీటిలో ఏ ఒక్కదానిపై చర్చించేందుకు ఇరు సభల స్పీకర్లు అనుమతించడం లేదు. దీంతో విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగుతూ సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. మొదటివారమంతా ఇదే పరిస్థితి నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో రెండో వారం తొలిరోజైన సోమవారం లోక్‌సభలో ఆందోళనకు దిగిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేశారు. వీరిని వర్షాకాల సమావేశాలు ముగిసేవరకు సభలో సస్పెండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వీరిలో 18 మందిని సభ నుంచి సస్పెండ్ చేశారు. గత రెండు రోజుల్లో సస్పెండ్ చేసిన 22 మంది ఎంపీల్లో తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది ఎంపీలు ఉండటం గమనార్హం.