గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (13:16 IST)

కరోనా వైరస్ సోకిన యువతిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం..

దేశంలో కామాంధుల ఆగడగాలకు అడ్డేలేకుండా పోతుంది. ఆరోగ్యవంతులనే కాదు.. చివరకు కోవిడ్ రోగులను కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా కరోనా వైరస్ బారిన మహిళా రోగులపై సైతం అత్యాచారం జరుపుతున్నారు. తాజాగా కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడిన ఓ యువతిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పఠనమిట్ట జిల్లా పంథాల ప్రాంతంలో ఓ యువతి బంధువుల ఇంట్లో ఉంటోంది. కరోనా లక్షణాలుండటంతో క్వారంటైన్‌లో ఉన్న ఆమెకు పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చింది. ఆమెతోపాటు మరొకరిని కరోనా సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లేందుకు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌ నౌఫాల్‌ (25) వచ్చాడు. 
 
ఇద్దరిని వేర్వేరు చోట్లకు తీసుకెళ్లాల్సి రావడంతో మొదట మహిళను ఓ హాస్పటల్‌లో వదిలేశాడు. యువతిని మరో చోటుకు తీసుకెళ్తూ మార్గమధ్యలో లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం అర్థరాత్రి ఆమెను కోవిడ్‌ -19 సంరక్షణ కేంద్రంలో వదిలేశాడు. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు అరన్ములా పోలీసులు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఘటనపై ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డ్రైవర్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని '108 సర్వీస్' కార్యాచరణ భాగస్వామి జీవీకే సంస్థకు సూచించారు. నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.