1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2023 (15:16 IST)

జమిలి ఎన్నికలు కేవలం మీడియా సృష్టే : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్

anurag thakur
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలు వెళ్లే ఆలోచనే లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ అన్నారు. జమిలి ఎన్నికలు అనే ప్రచారం కేవలం మీడియా సృష్టేనని చెప్పారు. దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలపై పెద్ద చర్చే సాగుతుంది.

దీనిపై అనురాగ్ ఠాగూర్ స్పందిస్తూ, త్వరలో కొన్ని రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను ముందుకు జరిపి లేదా ఆలస్యం చేసి లోక్‌సభ ఎన్నికలతో పాటు కలిపి నిర్వహించే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. తన పదవీకాలం చివరి రోజు వరకు ప్రజలకు సేవ చేయాలని ప్రధాని మోడీ భావిస్తున్నారని చెప్పారు. 
 
ఎన్నికలు ముందుగా లేదా ఆలస్యంగా జరుగుతాయని ప్రసార మాధ్యమాల్లో వస్తున్నవి ఊహాగానాలేనని తోసిపుచ్చుతూనే.. జమిలి ఎన్నికలను ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం సరికాదని అన్నారు. ప్రతిపక్ష నేతలకు ప్రజాస్వామ్యయుత చర్చలపై నమ్మకం లేదు కాబట్టే కమిటీ నుంచి వైదొలిగారని చెప్పారు. మరోవైపు, జమిలి ఎన్నికలు నిర్వహిస్తే వచ్చే నష్టం ఏమిటని ఠాకుర్ ప్రశ్నించారు. ఏకకాలంలో ఎన్నికలు జరగడం వల్ల ఆదా అయిన సమయాన్ని, డబ్బును పేద ప్రజల అభివృద్ధికి, వారి సంక్షేమానికి కేటాయించొచ్చని చెప్పారు. 
 
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించే హక్కు ప్రభుత్వానికి ఉందని తెలిపారు. కేంద్రం నియమించిన కమిటీలో ప్రతిపక్ష నేతలకు సైతం చోటు కల్పించి, వారి అభిప్రాయాలను వెల్లడించే వీలు కల్పించామన్నారు. ప్రభుత్వ విశాల హృదయాన్ని అది చాటుతోందని చెప్పారు. 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' కోసం ఏర్పాటైన కమిటీ.. దాని విధివిధానాలను రూపొందించడంలో ఆ కమిటీ సభ్యులు నిమగ్నమైవున్నారు.