1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (10:40 IST)

భారత్‌లో చొరబడేందుకు సిద్ధంగా 250 మంది ఉగ్రవాదులు

terrorists
భారత్‌‍లో చొరబడేందుకు 250 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని లాంచ్ ప్యాడ్‌ల వద్ద ఈ ఉగ్రవాదులు నిరీక్షిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేసింది. 
 
భారత భూభాగంలోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వద్ద సుమారు 250 మంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నిరీక్షిస్తున్నారని నిఘా వర్గాల హెచ్చరిక నేపధ్యంలో సైన్యం అలర్ట్ అయింది. సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేసింది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తిప్పికొట్టేందుకు సన్నద్ధమైంది. ముఖ్యంగా ఉత్తర కాశ్మీరులోని కేరన్ పోస్ట్ వద్ద నిఘాను తీవ్రతరం చేసింది. 
 
మరోవైపు, ఇటీవలికాలంలో పాకిస్థాన్ నుంచి మన దేశంలోకి ఉగ్రవాదుల చొరబాట్లు తగ్గినప్పటికీ... డ్రగ్స్ మాత్రం పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా అవుతున్నాయి. డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బులతో పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది. 
 
ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ మాట్లాడుతూ, ఉగ్రవాదులే కాకుండా మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు, ఆయుధాలు భారత్‌లోకి రాకుండా నిఘాను కట్టుదిట్టం చేశామని చెప్పారు. ఇంకోవైపు, జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌‍కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులను భద్రతాదళాలు కాల్చి చంపాయి.