1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (13:14 IST)

బీజేపీ ఎంపీ ఆత్మహత్య.. అమిత్ షా సంతాపం... కీలక సమావేశం రద్దు

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చెందిన బీజేపీ ఎంపీ మండి రామ్ స్వరూప్ శర్మ ఢిల్లీలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి సమీపంలోని గోమతీ అపార్ట్‌మెంట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కి వేలాడుతూ ఈయన మృతదేహం కనబడింది. ఈయన ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. 
 
ఓ ఉద్యోగి నుంచి తమకు ఫోన్ కాల్ అందిందని, వెళ్లి చూస్తే డోర్ లోపలి నుంచి వేసి ఉందని పోలీసులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ప్రాంతానికి చెందిన ఈ ఎంపీ మృతిపట్ల హోం మంత్రి అమిత్ షా తన ట్విటరులో తీవ్ర సంతాపం తెలిపారు. 
 
రామ్ స్వరూప్ శర్మకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మండి జిల్లాలోని జల్ పెహర్ గ్రామంలో 1958 లో జన్మించిన ఈయన రెండు సార్లు ఎంపీగా ఉన్నారు. 
 
2014లో, ఆ తర్వాత 2019 లో ఈయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. విదేశీ వ్యవహారాలపై ఉన్న స్టాండింగ్ కమిటీలోను, ఈ శాఖ కన్సల్టేటివ్ కమిటీలో కూడా శర్మ సభ్యుడిగా ఉన్నారు. ఈయన మృతికి సంతాప సూచనగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని రద్దు చేశారు. 
 
ఈ సమావేశం గురువారం ఉదయం జరగాల్సి ఉంది. శర్మ ఎందుకు సూసైడ్ చేసుకున్నారన్న విషయం స్పష్టం కాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.