1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (12:15 IST)

కోటాలో జేఈఈ అభ్యర్థి మిస్సింగ్... చంబల్‌‍లోయలో విగతజీవిగా...

deadbody
రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకునే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల పరీక్ష పేరుతో హాస్టల్ నుంచి బయటకు వచ్చి అదృశ్యమైన రచిత్ అనే విద్యార్థి చంబల్‌లోయలో విగతజీవిగా కనిపించాడు. వారం రోజుల గాలింపు చర్యల అనంతరం ఆ అభ్యర్థి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అలాగే, తాజాగా అదృశ్యమైన మరో విద్యార్థి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
ఈ నెల 11వ తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రచిత్ సోంధియా అనే విద్యార్థి జేఈఈ పోటీ పరీక్షల కోసం కోటాలో చదువుకుంటున్నాడు. పరీక్ష ఉందని చెప్పి హాస్టల్ నుంచి బయటకు వచ్చిన రచిత్ చివరిసారిగా గరాడియా మహదేవ్ ఆలయ సమీపంలోని అడవిలోకి వెళ్తూ అక్కడి సెక్యూరిటీ గార్డు కెమెరాలకు చిక్కాడు. ఆ తర్వాత అతడి జాడ కనిపించలేదు. డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్‌తో వారం రోజులుగా గాలించినా ఫలితం లేకుండా పోయింది. చివరిక చంబల్‌లోయలో పడి అతడి మృతదేహాన్ని గుర్తించారు. ఓ కొండపై నుంచి దూకి చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రచిత్ మృతితో ఈ నెలలో కోటాలో చనిపోయిన విద్యార్థుల సంఖ్య నాలుగుకు చేరింది. 
 
మరోవైపు, తాజాగా పియూష్ కపాసియా అనే మరో విద్యార్థి కూడా కోటా నుంచి అదృశ్యమయ్యాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పీయూష్ జేఈఈకి శిక్షణ పొందుతున్నాడు. ఈ నెల 13వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. రెండేళ్ళుగా కోటాలోని ఇంద్రవిహార్‌లోని హాస్టల్‌లో ఉంటున్న పియూష్ అదృశ్యం కావడానికి ముందు కుటుంబంతో సంబంధ బాంధవ్యాలను తెంచుకున్నాడు. చివరిసారిగా గత మంగళవారం తల్లితో మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదని పియూష్ తండ్రి తెలిపాడు. ఆ తర్వాత ఫోన్‌ను స్విచాఫ్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పీయూషం కోసం గాలిస్తున్నారు.