గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2020 (17:01 IST)

కాంగ్రెస్ కురువృద్ధుడు మోతీలాల్ ఓరా కన్నుమూత

కాంగ్రెస్ పార్టీకి చెందిన కురువృద్ధ నేతల్లో ఒకరైన మోతీలాల్ ఓరా ఇకలేరు. 93 యేళ్ళ వయసులో ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూడా. 
 
గత కొంతకాలంగా మూత్రకోశ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఓరాను కొద్దిరోజుల క్రితం ఓక్లాలోని ఎస్కాట్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు కరోనా వైరస్ కూడా సోకింది. అయితే, ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అయినప్పటికీ శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తడంతో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
అయితే, ఆదివారం నాటికి 93 ఏళ్లు పూర్తిచేసుకున్న ఆయన.. పుట్టినరోజు తెల్లారే తుదిశ్వాస విడవడం గమనార్హం. 1927 డిసెంబర్ 20న మోతీలాల్ ఓరా జన్మించారు. రెండుసార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 
 
తొలుత సమాజ్వాదీ పార్టీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటికీ, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఓరాకు పేరుంది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సుధీర్ఘకాలం కోశాధికారిగా కూడా పని చేశారు. 
 
కాగా, ఇటీవల తరుణ్ గొగోయ్, అహ్మద్ పటేల్, ప్రణబ్ ముఖర్జీ సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ నేతలు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలు వరుసగా కన్నుమూయడం ఆందోళన కలిగిస్తోంది.