శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 జనవరి 2023 (12:00 IST)

ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం రైళ్లను ఆపివేశారు.. ఎక్కడ?

train
సాధారణంగా రైళ్లు వెళుతుంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా దారి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం లెవల్ క్రాసింగ్‌ల వద్ద గేట్లు మూసివేసి వాహనాల రాకపోకలను నిలిపివేస్తుంటారు. అయితే, బిహార్ రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా జరిగింది. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం ఏకంగా రైళ్లనే నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చాలాసేవు రెడ్ సిగ్నల్ ఉండటంతో అనేక మంది ప్రయాణికులు రైలు దిగి నడుచుకుంటూ వెళ్లిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
బిహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలో సీఎం నితీశ్ కుమార్ సమాధాన్ యాత్రను చేస్తున్నారు. ఇందులోభాగంగా, రైలు పట్టాలను ముఖ్యమంత్రి కాన్వాయ్ దాటాల్సివుంది. ఇందుకోసం రైళ్లను ఏకంగా 15 నిమిషాల పాటు నిలిపివేశారు. బక్సర్ రైల్వే స్టేషన్ ఔటర్ సిగ్నల్ వద్ద రెండు రైళ్లు నిలిచిపోయాయి. సీఎం వెళ్లిపోయిన తర్వాత వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పటికే విసుగెత్తిన ప్రయాణికులు కొందరు రైలు దిగి పట్టాల వెంబడి నడుచుకుంటూ బక్సర్ రైల్వే స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లారు. ఈ చర్యను కేంద్ర సహాయ మంత్రి అశ్విని చౌబే తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేపట్టింది సమాధాన్ యాత్ర కాదని విఘాత యాత్ర అని విమర్శించారు.