గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 జులై 2021 (10:03 IST)

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు: దీక్షా శిబిరాల్లో వరుస ప్రమాదాలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత యేడాదిన్నర కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీకి సమీపంలోని సింఘు సరిహద్దులో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే, రైతులు ఆందోళన చేస్తున్న రైతుల శిబిరాల్లో వరస అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 
 
శనివారం సాయంత్రం ఓ శిబిరంలో రెండు టెంట్లు అగ్నికి ఆహుతి కాగా, ఆ తర్వాత కాసేపటికే మరో శిబిరంలో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఈ ఘటనపై రైతు సుఖ్వీందర్ సింగ్ అనుమానం వ్యక్తం చేశాడు. సాయంత్రం 5.30 గంటలకు మొదటి గుడారంలో అగ్ని ప్రమాదం సంభవించిందని, ఆ తర్వాత కాసేపటికే అక్కడికి 100 మీటర్ల దూరంలో ఉన్న రెండో గుడారంలోనూ మంటలు అంటుకున్నాయని పేర్కొన్నారు.
 
ఎవరో వచ్చి కావాలనే ఈ ఘాతుకానికి పాల్పడుతున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంపై స్పందించిన కిసాన్ మోర్చా.. ఎవరు ఎన్ని చేసినా తమ స్ఫూర్తిని దెబ్బతీయలేరని స్పష్టం చేసింది. 
 
మరోవైపు, రైతుల ఆందోళనపై స్పందించిన పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్ధూ మాట్లాడుతూ.. రైతులు తనను ఆహ్వానిస్తే కాళ్లకు పాదరక్షలు లేకుండా వెళ్లి కలుస్తానని పేర్కొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా విజయం తనకు అత్యంత ప్రాధాన్య విషయమని సిద్ధూ పేర్కొన్నారు.