గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 జులై 2024 (18:57 IST)

రైతుకు ఎంట్రీ నిరాకరించిన మాల్‌ యాజమాన్యానికి షాక్.. వారం రోజుల మూసివేతకు ఆదేశం!!

gt mall
బెంగుళూరు మహానగరంలో పంచెకట్టుతో వచ్చిన ఓ రైతును మాల్‌లోకి అనుమతించలేదు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మాల్ యాజమాన్యంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో కర్నాటకలోని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అన్నదాతను అవమానించే రీతిలో నడుచుకున్న ఆ మాల్‌ను వారం రోజుల పాటు మూసివేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ తరహా ప్రవర్తన వ్యక్తి గౌరవానికి భంగం కలిగించడం కిందికే వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
కాగా, బెంగుళూరు నగరంలోని మాగడి రోడ్డులో ఉన్న జీటీ మాల్‌లోని మల్టీప్లెక్స్‌లో కుమారుడితో కలిసి సినిమా చూసేందుకు మంగళవారం ఓ రైతు వచ్చారు. ఆయన పేరు పకీరప్ప. హావేరి ప్రాంత వాసి. అయితే, ఆ రైతును చూసిన సెక్యూరిటీగార్డు గోపాల్‌ ఆ రైతును అడ్డుకున్నాడు. పంచె కట్టుకుని వచ్చిన రైతును లోపలికి అనుమతించలేదు. పకీరప్ప కుమారుడు దానిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
 
ఈ ఘటనపై రైతు సంఘాల నాయకులు తీవ్రంగా స్పందించారు. మాల్‌ యాజమాన్యం క్షమాపణలు చెప్పకపోతే, పంచెకట్టుతో వేల మంది రైతులు వచ్చి మాల్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. దాంతో దిగొచ్చిన మాల్ యాజమాన్యం.. రైతుకు శాలువా కప్పి సత్కరించింది. అందరి ముందు క్షమాపణలు కోరింది. ఇకపై ఇటువంటి పొరపాటు చేయబోమని ప్రకటించింది. అయితే, కర్నాటక ప్రభుత్వం మాత్రం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించి వారం రోజుల పాటు మూసివేతకు ఆదేశించింది.