శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (13:59 IST)

భారత్-కెనడాల మధ్య మాటల యుద్ధం.. ఖండించిన విదేశాంగ శాఖ

indianflag
భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఖలీస్థానీ ఉగ్రవాదిని హతమార్చడంలో తమ పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. ఈ ఏడాది జూన్‌లో ఖలీస్థాన్ మద్దతారుడు, భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా గుర్తించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. 
 
సర్రేలోని గురుద్వారా సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చిచంపారు. దీంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్ వేదికగా భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్యకు భారతదేశానికి సంబంధం ఉందని తమకు సమాచారం ఉందంటూ వ్యాఖ్యానించారు.
 
తమ దేశ పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కెనడాలోనే హత్య చేయడాన్ని తమ సార్వభౌమత్వంపై జరిగిన దాడిగా చెప్పుకొచ్చారు. కెనడా విదేశాంగ మంత్రి కూడా భారత్‌పై ఆరోపణలు చేశారు. 
అంతటితో ఆగకుండా కెనడాలోని భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు వేశారు. దీంతో కెనడా ఆరోపణలపై భారత్ స్పందించింది. కెనడా ఆరోపణలను ఖండిస్తూ భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. 
 
కెనడాలో జరిగిన హింసాత్మక చర్యలో భారత్ ప్రభుత్వం ప్రమేయం ఉందనే ఆరోపణలు అసంబద్ధమైనవి. మనది చట్టబద్ధమైన పాలన పట్ల బలమైన నిబద్ధత కలిగిన ప్రజాస్వామ్యం. ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు కెనడాలో ఆశ్రయం పొందిన ఖలిస్తానీ ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుంచి దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తాయని విదేశాంగ శాఖ తెలిపింది.