శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 నవంబరు 2019 (13:45 IST)

శివసేనకు సీఎం... ఎన్సీపీ - కాంగ్రెస్‌లకు డిప్యూటీ సీఎం : ఉద్ధవ్ ఠాక్రే

మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ అంగీకరించకపోవడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. 56 సీట్లు కైవసం చేసుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు మొగ్గు చూపింది. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. 
 
ఇందులోభాగంగా, మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తహతహలాడుతున్న శివసేన ఉన్నతస్థాయి సమావేశం సోమవారం నిర్వహించింది. ఇందులో ముఖ్యమంత్రి పదవిని శివసేనకు, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మరోవైపు, ఈ సమావేశం అనంతరం శివసేన నేతలు పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలో మధ్యాహ్నం గవర్నర్‌తో మరోసారి భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మరింత గడువు కావాలని శివసేన గవర్నర్‌ను కోరనున్నది. 
 
ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్యాబలం శివసేనకు లేకపోవడంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కానీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్.. కాంగ్రెస్‌తో చర్చించాకే తమ నిర్ణయం చెప్తామని వారికి తెలిపారు. దీంతో సందిగ్దంలో పడిన శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు మరింత గడువు కావాలని గవర్నర్‌ను కోరనున్నారు.