1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (08:26 IST)

కరోనా రక్కసి... పార్లమెంట్ సమావేశాల కోసం కనీవినీ ఎరుగని ఏర్పాట్లు...

దేశాన్ని కరోనా రక్కసి పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే ఖచ్చితంగా సామాజిక భౌతిక దూరం పాటిస్తూనే వ్యక్తిగత శుభ్రత పాటించాలంటూ వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో పార్లమెంట్ సమావేశాలు ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలకు గతంలో ఎన్నడూలేని విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. 
 
ఇందుకోసం లోక్‌సభ, రాజ్యసభల సీటింగ్ స్వరూపాలు పూర్తిగా మారిపోనున్నాయి. ముఖ్యంగా భౌతిక దూరం నిబంధనను విధిగా పాటించాల్సి ఉండటంతో ఈసారి పార్లమెంట్ సమావేశాలు కొత్తగా జరగనున్నాయి.
 
1952 తర్వాత పార్లమెంటు చరిత్రలో సీటింగ్ ఏర్పాట్లు జరగడం ఇదే ప్రథమం. రాజ్యసభలో 60 మంది సభ్యులు చాంబర్ లో, 51 మంది సభ్యులు గ్యాలరీలో ఆసీనులవుతారు. మిగతా 132 మందికి లోక్ సభ చాంబర్ లో సీటింగ్ ఏర్పాటు చేశారు. 
 
లోక్‌సభలోనూ ఇలాంటి ఏర్పాట్లే కనిపించనున్నాయి. ఈ ఏర్పాట్ల కోసం చర్చించేందుకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జూలై 17నే సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం వెంకయ్యనాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఆగస్టు 3వ వారం నాటికి ఏర్పాట్లు పూర్తవ్వాలని తెలిపారు.
 
కాగా, ఈసారి సమావేశాల కోసం చాంబర్లలో ఒక్కోటి 85 అంగుళాల నాలుగు పెద్ద టెలివిజన్ స్క్రీన్లు, 40 అంగుళాల 6 టెలివిజన్ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు, నాలుగు గ్యాలరీల్లో ఆడియో కన్సోల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.