1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2020 (11:03 IST)

గత 24 గంటల్లో 1396 పాజిటివ్‌లు ... మొత్తం కేసులు 27,892 కేసులు

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ.. కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1396 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఈ కొత్త కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొత్తం 27892 కేసులు నమోదయ్యాయి. అలాగే, గత 24 గంటల్లో 48 మంది కరోనా వైరస్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ప్రస్తుతం దేశంలో 20,835 యాక్టివ్ కేసులు ఉండగా... 6,185 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 872కి చేరింది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
 
మరోవైపు, దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. ఇప్పటివరకు కేవలం వైరస్‌ బారినపడిన, అనుమానితులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేయలేకపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో నాలుగంచెల వ్యూహంతో కరోనా సోకిన వారిని గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌ నియంత్రణకు దక్షిణ కొరియా అనుసరించిన విధానాలను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనిపై పలు విషాయలను కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్థన్‌ మీడియాతో పంచుకున్నారు. దేశంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు సరికొత్త విధానాలను అనుసరించాలని కేంద్రప్రభుత్వం సంకల్పించిందని మంత్రి తెలిపారు. 
 
ఈ వ్యూహాల్లో భాగంగా, వైరస్‌ లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం (ట్రేస్‌) పరీక్షలు నిర్వహించడం (టెస్ట్‌) క్వారెంటైన్‌కు పంపడం (ఐసోలేషన్‌) వైద్య చికిత్స అందించడం (ట్రీట్‌) వంటి వ్యూహాన్ని అమలుపరుస్తున్నట్లు హర్షవర్ధన్‌ వెల్లడించారు. దీని వల్లన వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే నగర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించాలని కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు. మే చివరి నాటికి రోజుకు లక్ష పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.