1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (19:37 IST)

పాట్నా పేలుళ్ల కేసులో నలుగురికి మరణదండన

గత 2013లో బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నలుగురు వ్యక్తులను దోషులుగా కోర్టు నిర్ధారించింది. ఈ నలుగురు ముద్దాయిలకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో మొత్తం 9 మంది దోషులుగా తేలగా, వీరిలో నలుగురికి ఉరిశిక్షను విధించగా, మరో ఇద్దరికీ యావజ్జీవం, మరో ఇద్దరికీ పదేళ్లు, ఒకరికీ ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తూ జడ్జి గుర్విందర్‌ సింగ్‌ మల్హోత్ర తీర్పునిచ్చారు. 
 
బాంబు పేలుళ్లు జరిగిన 8 ఏళ్ల తర్వాత.. కేసులో దోషులకు శిక్ష ఖరారైంది. గత 2013 అక్టోబరు 27వ తేదీన బిహార్‌ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో బిజెపి నేతృత్వంలో హుంకార్‌ సభ జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రధాన మంత్రి అభ్యర్థి హోదాలో ముఖ్య అతిధిగా నరేంద్ర మోడీ హాజరయ్యారు. 
 
మోడీతో పాటు పలువురు వేదికపై ఉన్న సమయంలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 89 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై మరుసటి రోజే ఎన్‌ఐఎ దర్యాప్తు చేపట్టింది. తర్వాత ఏడాదికి చార్జీషీట్‌ దాఖలు చేసి.. 11 మందిని జాబితాలో చేర్చింది. సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ఇద్దరు నిర్దోషులుగా బయటపడ్డారు. ఇపుడు తీర్పురాగా, నలుగురు మరణశిక్షను ఎదుర్కోనున్నారు.