1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 27 జులై 2023 (13:50 IST)

సీమా హైదర్ కేసులో ట్విస్ట్ ... నకిలీ పత్రాలు ఇచ్చిన ఇద్దరి అరెస్టు

seema hyder
పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన భారతీయ ప్రియుడి కోసం రెండు దేశాల సరిహద్దులను దాటి భారత్‌కు వచ్చిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమెకు నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించిన ఇద్దరు వ్యక్తులను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరు నిందితులను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులందర్‌కు చెందిన పుష్పేంద్ర, పవన్‌గా గుర్తించారు. వీరి నుంచి మొత్తం 15 నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీరివద్ద గత మూడు రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో నకిలీ పత్రాల రాకెట్‌లో ఈ ఇద్దరికీ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 
 
కరోనా సమయంలో పబ్ జీ ఆడుతున్నప్పుడు గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల సచిన్ మీనాతో తాను ప్రేమలో పడ్డానని 30 ఏళ్ల పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ చెప్పిన విషయం తెల్సిందే. ఇప్పటికే గులాం హైదర్ అనే వ్యక్తితో వివాహమై నలుగురు పిల్లలతో ఉన్న సీమా.. సచిన్‌తో కలిసి ఉండేందుకు పాకిస్థాన్ నుంచి అక్రమంగా సరిహద్దులు దాటి భారత్‌లోకి వచ్చింది. 
 
ఆమె తొలుత మార్చిలో నేపాల్ సచిన్‌ను పెళ్లి చేసుకుంది. మే 13న పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించింది. దేశంలోకి అక్రమంగా చొరబడినందుకు సీమాను, ఆమెకు ఆశ్రయం ఇచ్చినందుకు సచిన్‌ను ఈనెల 4న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈమెన పాక్ గూఢచారి మహిళగా పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఆమె వద్ద మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.