శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 మార్చి 2021 (16:31 IST)

సీఎం పదవిలో ఉంటానో.. ఉండనో... అది మ్యాటర్ కాదు... : శర్బానంద్

అస్సాం రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద్ సోనోవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసోంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందన్నారు. అయితే, తను ముఖ్యమంత్రిగా ఉంటానో.. ఉండనో అన్నిది మ్యాటర్ కాదన్నారు. కానీ, ప్రజల నమ్మకాన్ని తమ పార్టీ చూరగొనడమే ముఖ్యమన్నారు. 
 
శనివారం అసోంలో మొదటి దశ ఎన్నికలు పూర్తయిన సందర్భంగా.. ఆదివారం ఆయన ఓ ఆంగ్ల మీడియా చానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సుస్థిర శాంతిని నెలకొల్పి, రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినందుకే ప్రజలు తమను ఆదరిస్తున్నారని సోనోవాల్ చెప్పారు. 
 
ఐదేళ్ల క్రితం అధికారం చేపట్టినప్పుడు తమకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయన్నారు. సుపరిపాలన అందించడం, రాష్ట్రాన్ని అవినీతి, తీవ్రవాదం, అక్రమ వలసదారుల సమస్యల నుంచి బయటపడేయడం వంటి సమస్యల్లో సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు.
 
ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎంతో శ్రద్ధ వహించారన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఉంటేనే భద్రత ఉంటుందని, అభివృద్ధి, శాంతి ఉంటాయని ప్రజలు భావిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని మీడియా ప్రతినిధి అడగ్గా.. ‘‘ముఖ్యమంత్రి ఎవరన్నది కాదు ప్రశ్న. సోనోవాల్ కే మళ్లీ అధికారం వస్తుందా? లేదా? అని కాదు. బీజేపీ మంచి పనులు చేసిందా? లేదా? అన్నదే ముఖ్యం. మేమందరం బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకే పనిచేస్తున్నాం’’ అని అన్నారు.