1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (17:19 IST)

రైలు పట్టాలపై గాయపడిన మొసలి.. నిలిచిపోయిన రాజధాని ఎక్స్‌ప్రెస్

గుజరాత్ రాష్ట్రంలోని వడోదర సమీపంలో మొసలి ఒకటి తీవ్రంగా గాయపడిన రైలుపట్టాలపై కనిపించింది. ఈ మొసలిని గమనించిన రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు డ్రైవరు రైలును సుమారు అర్థగంట సేపు నిలిపివేశారు. 
 
తాజాగా వెవడోదర-ముంబై మార్గంలోని కర్జన్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే పట్టాలపై రైలు ఢీకొని గాయపడిన మొసలిని ట్రాక్‌ తనిఖీ సిబ్బంది మంగళవారం ఉదయం గమనించారు. ఈ విషయాన్ని కర్జన్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్‌కు చెప్పారు. దీంతో ఆయన వన్యప్రాణుల సంరక్షణ సిబ్బందికి ఫోన్‌ చేశారు.
 
కాగా, ఆ సిబ్బంది వాహనంలో ఘటనా స్థలికి చేరుకునేందుకు సరైన మార్గం లేదు. దీంతో వారు స్టేషన్‌కు వచ్చే వరకు వడోదర-ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను కర్జన్‌ రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉంచారు. 
 
వీరు రైలు సిబ్బందితో కలిసిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టాల మధ్యలో తలకు గాయమైన మొసలిని గమనించారు. దానిని పట్టాల పక్కకు చేర్చారు. ఆ తర్వాత రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరి వెళ్లింది. 
 
మరోవైపు ఎనిమిది అడుగుల పొడవైన ఆ మొసలి అనంతరం కొంతసేపటికే చనిపోయినట్లు వణ్యప్రాణుల సంరక్షణ కార్యకర్తలు హేమంత్‌, నేహా తెలిపారు. మరణించిన ఆ భారీ మొసలిని ఆ తర్వాత కిసాన్‌ రైలులో తరలించి కర్జన్‌ అటవీశాఖకు అప్పగించినట్లు స్టేషన్ సూపరింటెండెంట్ సంతోష్ శర్మ చెప్పారు. మరోవైపు ఈ ఘటన వల్ల ఆ మార్గంలో ప్రయాణించే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ సుమారు 25 నిమిషాలు నిలిచిపోగా, మిగతా రైళ్లు సుమారు 45 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి.