శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 మే 2022 (09:55 IST)

షవర్మాతో మృతి.. వెలుగులోకి షిగెల్లా ఇన్ఫెక్షన్.. జాగ్రత్తగా లేకపోతే..?

shawarma
కేరళలో పదహారేళ్ల అమ్మాయి దేవానంద షవర్మా తినడంతో ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు కారణం కొత్త అంటువ్యాధి అంటూ తేలింది. ఆమె మరణానికి కారణం తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ అని తెలిసింది. అందులోనూ షిగెల్లా బ్యాక్టిరియా సోకిన ఆహారం తినడం వల్లే ఇలా జరిగిందని చెప్పారు ఇప్పుడు కేరళలో షిగెల్లా బ్యాక్టిరియాలో ఒకరి నుంచి ఒకరికి సోకుతుందేమోనన్న భయం అలుముకుంది.
 
షిగెల్లా ఇన్ఫెక్షన్ అనేది షిగెల్లా అని పిలిచే బ్యాక్టిరియా వల్ల కలుగుతుంది. దీన్ని షిగెల్లోసిస్ అని కూడా అంటారు. నోటి ద్వారా ప్రవేశించి పేగులపై అధిక ప్రభావం చూపిస్తుంది. ఇది సోకిన వెంటనే విరేచనాలు మొదలవుతాయి. ఒక్కోసారి రక్త విరేచనాలు కూడా కావచ్చు.
 
వాంతులు అవుతాయి. ఇది అంటు వ్యాధి. షిగెల్లా బ్యాక్టిరియా సోకిన ఆహారాన్ని తినడం వల్ల, ఆ బ్యాక్టిరియా సోకిన వ్యక్తి నుంచి కూడా పక్క వారికి ఇది సోకుతుంది. అందుకే చేతులు బాగా కడుక్కునే ఆహారాన్ని తినమని సూచిస్తున్నారు వైద్యులు. షిగెల్లా బ్యాక్టిరియా ఉన్న నీటిలో ఈత కొట్టినా కూడా ఇది వ్యాపిస్తుంది.
 
చికిత్స ఎలా?
తీవ్రమైన కేసుల్లో ఆసుపత్రిలో చేర్చి అత్యవసర చికిత్స అందించాల్సి రావచ్చు. చేయి దాటి పోతే మరణం కూడా సంభవించవచ్చు. ముఖ్యంగా వైద్యులు షిగెల్లా బ్యాక్టిరియాను చంపడానికి యాంటీ బయోటిక్స్‌ను సూచిస్తారు. ఒక వారంలో బ్యాక్టిరియా బయటికి పోతుంది లేదా నాశనం అవుతుంది. షిగెల్లా వైరస్ శరీరంలోకి చేరాక రెండు రోజుల తరువాత లక్షణాలు కనిపిస్తాయి. వారం రోజుల పాటూ గుర్తించకపోతే సమస్య తీవ్రంగా పెరుగుతుంది.
 
షిగెల్లా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. జ్వరం, విరేచనాలు, వాంతులు, బరువు తగ్గడం, డీహైడ్రేషన్ కు గురవ్వడం, రక్త విరేచనాలు కావడం కనిపిస్తే వెంటనే వైద్యుడిని కలవాలి. జ్వరం 101 డిగ్రీల ఫారెన్ హీట్ కన్నా ఎక్కువ ఉంటే వెంటనే ఆస్పత్రిలో చేరాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.