1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (08:58 IST)

రైతుల ఆందోళన మరింత ఉధృతం... 26న ట్రాక్టర్ ర్యాలీ - 14న కిసాన్ ర్యాలీ

Farmers Rally
పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, రుణమాఫీ, గతంలో నమోదైన కేసుల ఎత్తివేత తదితర డిమాండ్ల పరిష్కారం కోసం రైతులు రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళను అణిచివేసేందుకు కేంద్రం రైతులపై ఉక్కుపాదం మోపుతుంది. పలుమార్లు టియర్ గ్యాస్‌ను ప్రయోగించింది. అప్పటికీ రైతులు వెనక్కి తగ్గలేదు. దీంతో వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో ఓ రైతు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తమ ఆందోళనకు తాత్కాలిక విరామం ప్రకటించిన రైతు సంఘాల నేతలు.. తమ తదుపరి కార్యాచరణను ప్రకటించారు. తమ డిమాండ్ల పరిష్కారంలో భాగంగా, ఆందోళనను మరింత ఉధృతం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందులోభాగంగా, ఈ నెల 26వ తేదీన ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని, వచ్చే నెల 14వ తేదీన ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కిసాన్ ర్యాలీని నిర్వహించాలని తీర్మానించారు. ఈ మేరకు గురువారం పొద్దుపోయాక సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) కీలక ప్రకటన వెలువడింది. రాంలీలా మైదాన్‌లో భారీ 'కిసాన్ మహాపంచాయత్' నిర్వహించనున్నామని, మార్చి నెలలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నాని వెల్లడించింది.
 
కాగా బుధవారం పంజాబ్ - హర్యానా సరిహద్దులోని ఖానౌరీలో రైతులు - పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో చనిపోయిన యువ రైతు కుటుంబానికి రూ.1 కోటి పరిహారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం జరిగిన ఈ ఘర్షణలో పలువురు రైతులతో పాటు 12 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. దీంతో 'ఛలో ఢిల్లీ' మార్చ్‌ను రైతులు రెండు రోజులపాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే.
 
మరోవైపు, ఎంపిక చేసిన పంటలను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు ధరతో ఐదేళ్లపాటు కొనుగోలు చేస్తామంటూ కేంద్ర మంత్రులు బృందం ఇటీవల చేసిన ప్రతిపాదనను రైతులు తిరస్కరించిన విషయం తెలిసిందే. అన్ని పంటలకు కనీస మద్దతు ధరను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కొన్ని పంటలకే మద్దతు ధర ఇస్తే మిగతా పంటలు పండించే రైతులు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాగా, రైతుల నిరసనలను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటుచేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో సిమెంట్, ఐరన్ బారికేడ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.