1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Updated : సోమవారం, 4 మే 2015 (17:58 IST)

దక్షిణ కాలిఫోర్నియాలో నారా లోకేష్ ప్రభంజనం

ఎన్నారై తెలుగుదేశం పార్టీ లాస్ ఏంజెలెస్ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ నారా లోకేష్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నారా లోకేష్ ఇండియా నుండి బే ఏరియా చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో లాస్ ఏంజెలిస్ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఎన్నారై టిడిపి లాస్ ఏంజెలెస్ ఆధ్వర్యంలో 100 కార్లతో ర్యాలీగా బయలుదేరి, షెరటాన్ సెర్రితోస్ చేరుకున్నారు. 
 
తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మిత్రులు, సన్నిహితులు, స్నేహితులతో షెరటాన్ సెర్రితోస్ కిటకిటలాడింది. ఆదివారం సాయంత్రమని కూడా చూడకుండా, దక్షిణ కాలిఫోర్నియా నలుమూలల నుండి 600 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ ఆలపాటి రవి ప్రారంభోపన్యాసం చేస్తూ ఎన్టీఆర్ స్మృతులను నెమరేసుకుంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే, నారా లోకేష్ ను సాదరంగా ఆహ్వానించారు.

నారా లోకేష్ మాట్లాడుతూ... స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ కార్యక్రమం ప్రాముఖ్యత, అందులో ఎన్నారైల క్రియాశీలక పాత్ర గురించి వివరించారు. ఎన్నారైలు అందరూ కలిసి, రెండు తెలుగు రాష్ట్రాలకు తమవంతు సాయం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై తెదేపా లాస్ ఏంజెలెస్ మూడు తీర్మానాలను నారా లోకేష్‌కు ప్రతిపాదించారు.
 
1. ఎన్నారై తెలుగువారి ప్రతిభాపాటవాలను ఒక తాటిపైకి తీసుకువచ్చి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉపయోగపడేలా తెలుగుదేశం పార్టీ పాటుపడాలని పిలుపునిచ్చారు.
 
2. అంతర్జాతీయంగా ఉన్న తెలుగుదేశం పార్టీ విభాగాలను ( లాస్ ఏంజెలెస్, డల్లాస్, బే ఏరియా, న్యూజెర్సీ.. వగైరా), ఇండియాలోని తెలుగుదేశం పార్టీతో ధ్రువీకరించాలని ఆశించారు.
 
3. నారా లోకేష్ ను ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి ప్రభుత్వంలో కూడా తన సేవలను అందించాలని, ప్రగతికి పాటుపడాలని కోరారు.

 
ఈ కార్యక్రమంలో పలువురు అడిగిన ప్రశ్నలకు నారా లోకేష్ చురుకుగా సమాధానాలిచ్చారు. లోకేష్ ఇచ్చిన పిలుపు మేరకు, ఒక్క లాస్ ఏంజెలెస్ లోని తెలుగువారు, ఉత్తర అమెరికా తెలుగుసంఘం (NATS) ఆధ్వర్యంలో 126 గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చి, అమెరికాలోని తెలుగువారందరికీ ఆదర్శంగా నిలిచారు.