బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (11:16 IST)

శ్రీవారి భక్తులకు శుభవార్త.. కల్యాణ లడ్డూతో పాటు వడ ప్రసాదం

శ్రీవారి భక్తులకు ఓ శుభవార్త. ఇకపై కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు లడ్డూతో పాటు వడ ప్రసాదం కూడా లభించనుంది. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. 
 
ఫిబ్రవరి 20, గురువారం నుంచి సామాన్య భక్తులకు వడ ప్రసాదాన్ని అందించేందుకు టీటీడీ అన్నీ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రోజుకు పదివేల కల్యాణం లడ్డూలు, పదివేల వడ ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి చెప్పారు. 
 
ఇప్పటికే నెల 12న సాధారణ భక్తులకు కల్యాణం లడ్డూలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎటువంటి సిఫారసు లేఖలు లేకుండా కల్యాణం లడ్డూలను ప్రత్యేక కౌంటర్ ద్వారా సామాన్య భక్తులకు అందిస్తోంది. దీని ధర రూ.200. ప్రస్తుతం కల్యాణ లడ్డూలతో పాటు వడ ప్రసాదాన్ని కూడా అందించనుంది.
 
ఇదిలా ఉంటే.. ఏడుకొండలపై భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివాలయాలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. చాలా రోజుల తర్వాత తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం ఖాళీ అయ్యింది. 
 
బుధవారం నాడు స్వామి వారిని 68,065 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. సర్వ, దివ్య తదితర అన్ని దర్శనాలకూ ఒకటిన్నర నుంచి రెండు గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో చాలా తక్కువ మంది భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారని అధికారులు తెలిపారు.