శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Selvi
Last Updated : శనివారం, 26 జులై 2014 (19:21 IST)

దత్తాత్రేయ కవచమ్.. గురు పూజతో ఐశ్వర్యాలు సొంతం!

దత్తాత్రేయుడు గురువులకే గురువు విజ్ఞాన ఖని. అయినప్పటికీ సాధారణ వ్యక్తిలా గురువుల వద్ద వినయంగా విద్యను అభ్యసించిన సద్గుణ సంపన్నమూర్తి. సకల వేదస్వరూపుడు. జ్ఞానామృతాన్ని జగత్తుకు పంచిన సద్గురు చక్రవర్తి. మౌనముద్రతోనే శిష్యుల సందేహాలను నివృత్తి చేసి గురుస్థానం దక్కించుకున్న దత్తాత్రేయుడు విశ్వానికే గురువయ్యాడు. అందుకే దత్తాత్రేయుని 
 
''జన్మ సంసార బంధఘ్నం స్వరూపానందదాయకం 
 నిశ్రేయసప్రద వందే స్మర్త్రగామీ నమావతు''
 
అని ప్రార్ధించుకుంటాం. జన్మ సంసార బంధనాల్ని తేలిగ్గా తెంచగలిగిన మహానుభావుడు, జ్ఞాననందాన్ని పంచగలిగిన ప్రేమమూర్తి, ముక్తిపథంలో నడిపించి మోక్షాన్ని ప్రసాదించగలిగిన పరమ యోగీశ్వరుడు దత్తాత్రేయుడు.
 
దత్తాత్రేయుడు విశిష్టమైన ఆచార్యస్థానం ఆక్రమించాడు. ఈ విశిష్టమైన స్థానం ఇంత తేలిగ్గా లభించిందా అని ఆశ్చర్యపోనవసరం లేదు. సాక్షాత్తూ దేవదేవుడైన దత్తాత్రేయుడు 24 మంది గురువుల వద్ద విద్యను అభ్యసించాడు. కనుకనే దత్తాత్రేయుని పరమ గురువుగా కొలుస్తున్నాం. అందుకే గురుపూజ చేస్తే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి. విద్యకు లోటుండదు. ఆర్థిక ఇబ్బందులుండవు అని పురోహితులు చెబుతున్నారు.