మంగళవారం, 17 సెప్టెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 5 జనవరి 2022 (21:19 IST)

జ‌న‌వ‌రి 11న‌ శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, బ్రేక్ ద‌ర్శ‌నం ర‌ద్దు

తిరుమల శ్రీవారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 13న‌ వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకుని జ‌న‌వ‌రి 11న‌ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

 
ఈ సంద‌ర్భంగా ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హిస్తారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభ‌మ‌వుతుంది.

 
కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11వ తేదీ మంగ‌ళ‌వారం శ్రీవారి ఆలయంలో బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేయ‌డం జ‌రిగింది. ఈ కార‌ణంగా జ‌న‌వ‌రి 10న సోమ‌వారం సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు.