శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 జనవరి 2021 (10:47 IST)

జనవరి 12 నుంచి థాయ్‌లాండ్ ఓపెన్.. ఇంగ్లండ్‌కు వెళ్తున్న పీవీ సింధు?

జనవరి 12 నుంచి జరుగనున్న థాయ్‌లాండ్‌ ఓపెన్‌తో సింధు మళ్లీ అంతర్జాతీయ టోర్నీ బరిలో దిగనున్నారు. థాయిలాండ్‌ ఓపెన్‌కు ఆమె లండన్‌ నుంచే వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. భారత్‌లో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంగ్లండ్ వెళ్లి సాధన చేయాలనుకోవడం తాను తీసుకున్న ఉత్తమ నిర్ణయాల్లో ఒకటని తెలిపింది. 
 
ఇక్కడ చలి మరీ ఎక్కువగా ఉండటం ఇబ్బందే కానీ.. ఎంతో తీవ్రతతో సాగిన శిక్షణ కార్యక్రమాలను బాగా ఆస్వాదించా. ఇప్పట్నుంచి వరుసగా టోర్నీలు ఆడతామని ఆశిస్తున్నా. సురక్షిత స్థితిలో ఉంటూనే.. కష్టపడుతూ, ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ ముందుకు సాగాలి. కరోనా వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందేనని చెప్పారు. 
 
లండన్‌లో కొత్త సంవత్సరం వేడుకలలో పాల్గొన్న ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధు మరిన్ని విషయాలను కూడా పంచుకున్నారు. తన సాధన బాగా సాగుతోందని, టైటిల్ సాధించడంపైనే దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. సింధు చివరిసారిగా మార్చి 11 నుంచి 15 వరకు జరిగిన ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీలో తలపడ్డారు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న సింధుకు థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో అనుకూలమైన 'డ్రా' ఎదురైంది.