గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 12 జులై 2024 (17:42 IST)

ఎమ్మెల్యేలను పురుగుల్లా చూశారు : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్

danam nagender
భారత రాష్ట్ర సమితి అధినేతలు ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. ముఖ్యంగా, భారాస అధినేత కేసీఆర్.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన చూసేందుకు లేదా కలిసేందుకు అపాయింట్మెంట్ లభించేంది కాదన్నారు. ఒక వేళ దొరికినా గంటల తరబడి బయట వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. అందుకే విలువ లేని చోట ఉండలేకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. 
 
ఇటీవలే భారాసకు స్వస్తి చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన దాన నాగేందర్ తాజాగా మాట్లాడుతూ, భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ ఒక కార్పొరేట్ సంస్థ మాదిరి నడిపారని దుయ్యబట్టారు. రెండు రోజుల్లో మరో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని... 15 రోజుల్లో బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుందని ఆయన జోస్యం చెప్పారు. బీఆర్ఎస్‌పై ఎమ్మెల్యేలకు నమ్మకం లేదని అన్నారు.
 
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని దానం ఆరోపించారు. కేటీఆర్ బినామీలు కూడా వేల కోట్లు దోచేశారని చెప్పారు. వీటికి సంబంధించిన ఆధారాలను త్వరలోనే బయట పెడతానని తెలిపారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నారని చెప్పారు. కవిత జైల్లో ఉంటే ఆమెను బయటకు తీసుకురాకుండా... రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీలో చివరకు నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు.