1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Telangana Assembly Winter Session: KCR Makes Rare Appearance

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఆసక్తికర సంఘటన- కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్

KCR-Revanth Reddy
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం, డిసెంబర్ 29, 2025న ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా సాగునీటి సమస్యలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకంపై చర్చ జరిగింది. డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీలలో అసెంబ్లీ సమావేశాలు జరగవు. జనవరి 2న తిరిగి ప్రారంభమవుతాయి. గత రెండు సంవత్సరాలుగా చాలా వరకు సమావేశాలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు సోమవారం జరిగిన శాసనసభ సమావేశానికి హాజరయ్యారు.
 

 
జల సమస్యలపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో, కేసీఆర్ తిరిగి సభలోకి రావడం రాబోయే శీతాకాల సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయని సంకేతమిస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్న కేసీఆర్‌కు సభా ప్రాంగణంలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. 
 
అలాగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విపక్ష నేత హోదాలో అసెంబ్లీకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కరచాలనం చేశారు. సభలో కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్ రెడ్డి వాకబు చేశారు. మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌, సీతక్క, ఎమ్మెల్యే నవీన్‌యాదవ్‌ ఆయనను పలకరించి అభివాదం చేశారు.
 
పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపిందని, అయితే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమైందని కేసీఆర్ ఇటీవల అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. గత రెండేళ్లుగా ఆయన ఎక్కువగా అసెంబ్లీకి దూరంగా ఉన్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
అసెంబ్లీకి ఎందుకు వచ్చారో.. ఎందుకు వెళ్ళారో కేసీఆర్‌ను అడగండి : సీఎం రేవంత్ రెడ్డి