1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 అక్టోబరు 2021 (16:21 IST)

నా చావే చివరిదికావాలి.. ఉద్యోగ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగి బలిదానం

తెలంగాణా రాష్ట్రంలోని పలువురు నిరుద్యోగులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంతో విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో నిరుద్యోగి ప్రాణాలు తీసుకున్నాడు. తన చావే చివరిది కావాలంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. 
 
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జబ్బర చెలుక గ్రామానికి చెందిన ఆసంపల్లి మహేష్ (28)... కొద్ది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయకపోవడంతో మనస్తాపం చెంది వెల్మపల్లె గ్రామ సమీపంలోని పత్తి చేనులో పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. 
 
నోటిఫికేషన్లు లేకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాశాడు. ‘సీఎం కేసీఆర్ మీకు దండం పెడుతా.. ఇప్పటికైనా నోటిఫికేషన్లు వేయండి. మీ కాళ్లు పట్టుకుంటా. నాలాగా ఎవరూ రాలిపోకూడదు. నిరుద్యోగిగా తన చావే చివరిది కావాలి’ అని మహేష్ తన లేఖలో రాశాడు.
 
కాగా.. నిరుద్యోగి ఆత్మహత్య విషయం తెలుసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషయం బయటకు పొక్కకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని.. పంచనామా నిర్వహించారు. వైద్య సిబ్బందిని కూడా అక్కడికే పిలిపించి పోస్టుమార్టం నిర్వహించారు. 
 
సాధారణంగా ఎవరైనా చనిపోతే డెడ్ బాడీ‎ని తీసుకుని ఆస్పత్రికి వెళ్లినా గంటల తరబడి జాప్యం చేసే వైద్యులు, పోలీసులు గంటల్లోనే నిరుద్యోగి గ్రామానికి వెళ్లి పంచనామా, పోస్టుమార్టం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. నిరుద్యోగి ఆత్మహత్య విషయం బయటకు పొక్కితే ప్రభుత్వ పరువుకు భంగం కలుగుతుందనే ఉద్దేశ్యంతో గోప్యంగా ఉంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.