గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (11:10 IST)

జైల్లో నా భర్తకు ప్రాణహాని వుంది : హైకోర్టును ఆశ్రయించిన రాజాసింగ్ భార్య

Court
తన భర్తకు ప్రాణహాని ఉందని, అందువల్ల ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి ఉషాబాయి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై ఆమె తెలంగాణ హైకోర్టులో ఏ పిటిషన్ దాఖలు చేశారు. 
 
పదే పదే మతపరమైన వ్యాఖ్యలు చేసి శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారన్న కారణంగా రాజాసింగ్‌ను పీడీ చట్టం కింద నిర్బంధంలోకి తీసుకున్న విషయం విదితమే. దీనిని సవాలు చేస్తూ ఇప్పటికే రాజాసింగ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, ఆయనను ప్రత్యేక తరగతి ఖైదీగా గుర్తించి వసతులు కల్పించాలని భార్య తాజాగా పిటిషన్‌ వేశారు. 
 
ప్రత్యేక గది, మంచం, టేబుల్‌, కుర్చీ, వార్తాపత్రికలు, టీవీ, వంట చేసుకోవడానికి తగిన సౌకర్యాలు కల్పించాలని కోరారు. జైలులో ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచివుందని, ఇతర ఖైదీలకు దూరంగా ఉంచాలని కోరారు.
 
ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కన్నెగంటి లలిత విచారణ చేపట్టగా వాదనలు వినిపించడానికి గడువు కావాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోరడంతో విచారణను 28కి వాయిదా వేశారు.