1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2023 (14:59 IST)

రైల్వే పనితీరు భేష్.. జారిపోయిన చెప్పును అప్పగించిన సిబ్బంది...

ఇటీవలి కాలంలో రైల్వే శాఖ పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు రైల్వే శాఖ అధికారులు తమ వంతు కృషి చేస్తున్నారు. తాజాగా రైలు ఎక్కుతుండగా, జారిపడిపోయిన చెప్పును తిరిగి ప్రయాణికుడికి అప్పగించారు. ఈ ఆసక్తికర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జనగామ జిల్లా చిలుపూరు మండలం, పల్లగుట్టకు చెందిన రాజేష్‌ (25) అనే యువకుడు శనివారం సికింద్రాబాద్‌ వెళ్లడానికి స్టేషన్‌‌ఘణపురం రైల్వేస్టేషన్‌కు వచ్చారు. కదులుతున్న రైలు ఎక్కుతుండగా తన కాలికి ఉన్న ఒక చెప్పు జారి రైలు పట్టాల మధ్యలో పడింది. 
 
'చెప్పులు కొత్తవి. నాకు చాలా ఇష్టమైనవని...' అంటూ రైల్వే అధికారులకు ట్వీట్‌ చేశారు. దీంతో సికింద్రాబాద్‌ డివిజనల్‌ భద్రతాధికారి దేబాస్మిత స్పందించి కాజీపేట ఆర్పీఎఫ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ ఆ విద్యార్థి చెప్పును కాజీపేటకు తీసుకువచ్చి ఆదివారం రాజేష్‌కు అప్పగించారు. ఈ వార్త కాస్త వినడానికి కొంత వింతగా ఉన్నా.. చెప్పును కూడా రికవరీ చేయడం పోలీసుల పనితీరుకు అద్దం పడుతుంది.