శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

సీతారాముల తలంబ్రాలు డోర్‌ డెలివరీ.. ఎక్కడ?

Lord Rama
ప్రతి ఒక్క హిందువుకు శ్రీరాముడు ఇష్టదైవంగా ఉంటారు. అలాంటి రాములోడి తలంబ్రాలు ఇంటి వద్దకే డెలివరీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. భద్రాద్రి రామయ్య భక్తులకు ఈ తలంబ్రాలను డోర్ డెలివరీ చేసేలా తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖతో ఒక అవగాహన కూడా కుదుర్చుకుంది. 
 
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణ తలంబ్రాలను కోరిన వారికి ఇంటికే డోర్ డెలివరీ చేయనున్నట్టు తెలిపింది. అయితే, ఇందుకోసం రూ.116 చెల్లించాల్సి ఉంటుంది. ఈ తలంబ్రాలు కావాల్సిన వారు ఆర్టీసీ కార్గో కేంద్రాల్లో డబ్బులు చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 
 
ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తులకు ఇంటి వద్దకే పంపిస్తామని తెలిపారు. రూ.116 చెల్లించి బుకింగ్‌ను ప్రారంభించినట్టు చెప్పారు. 
 
గత యేడాది కూడా 89 వేల మందికి స్వామివారి కళ్యాణ తలంబ్రాలను అందించినట్టు తెలిపారు. ఈ సేవలు పొందాలనుకునేవారు ఆర్టీసీ లాజిస్టిక్ విభాగాన్ని 91776 83134, 73829 24900, 91546 80020 అనే నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.