శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (13:43 IST)

'మన్మథుడు'తో టాలీవుడ్ స్వీటి! స్టేజ్‌ను పంచుకోనున్న జేజెమ్మ

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో నాలుగో సీజన్‌లో సినీ నటి అనుష్క సందడి చేయనుంది. ఈ షో హోస్ట్‌గా టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్నారు. అయితే, ఆదివారం జరిగే షోలో నాగార్జునతో కలిసి అనుష్క హోస్ట్‌గా వ్యవహరించనుంది. 
 
దీనికి కారణం లేకపోలేదు. అనుష్క నటించిన తాజా చిత్రం 'నిశ్శబ్దం'. ఈ చిత్రం వచ్చే నెల రెండో తేదీన ఓటీటీలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ వేదికనే ప్రమోషనల్ ఈవెంట్‌కు వేదికగా మార్చుకోవాలని అనుష్క భావించినట్టు తెలుస్తోంది. గత రెండురోజులుగా అనుష్క బిగ్ బాస్ వేదికపైకి రానుందని, ఇందుకు సంబంధించిన షూటింగ్ జరిగి పోయిందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలు ఆదివారం నిజం కానున్నాయి. 
 
ఆదివారం రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జునతో పాటు అనుష్క మరోసారి స్టేజ్‌ని పంచుకోనుందని, అనుష్క కనిపించగానే కంటెస్టెంట్లు ఆశ్చర్యపోతారని అంటున్నారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకు వేసి, బిగ్ బాస్‌కు అనుష్క రెండో మహిళా సెలబ్రిటీగా నిలుస్తారని, నాగ్ నుంచి ఆమె బాధ్యతలను స్వీకరిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. 
 
కాగా, బిగ్ బాస్‌కు తొలి మహిళా వ్యాఖ్యాతగా రమ్యకృష్ణ వ్యవహరించిన సంగతి తెలిసిందే. గతంలో తన పుట్టిన రోజు వేడుకల కోసం నాగార్జున విదేశాలకు వెళ్లగా, ఆయన స్థానంలో రమ్యకృష్ణ కొన్ని రోజులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇపుడు అనుష్క రెండో సెలెబ్రిటీగా కానున్నారు. 
 
అయితే, ఇక తదుపరి కొన్ని వారాల పాటు అనుష్కే హోస్ట్‌గా వ్యవహరిస్తుందా? లేక కేవలం ఒక్క ఎపిసోడ్ కు మాత్రమే పరిమితమవుతారా? అన్న విషయం ఆదివారం రాత్రితో క్లారిటీ రానుంది.