శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 నవంబరు 2019 (12:55 IST)

మాతృభాష నేత్రాల వంటిది - పరభాష కళ్ళజోళ్లు వంటిది : చంద్రబోస్

మాతృభాష గొప్పతనాన్ని సినీ గేయరచయిత చంద్రబోస్ మరోమారు వివరించారు. మాతృభాష రెండు నేత్రాల వంటివనీ, పరభాష (ఆంగ్లం) కళ్లజోడు వంటిదని ఆయన చెప్పుకొచ్చారు. అందువల్ల మాతృభాషను మరచిపోతే భవిష్యత్తే లేదన్నారు. 
 
కృష్ణాజిల్లా చల్లపల్లిలో స్వచ్ఛ చల్లపల్లి ఐదేళ్ల వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రబోస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానసిక వికాసం మాతృభాషతోనే సాధ్యమన్నారు. పిల్లలకు తల్లి గర్భంలోనే గ్రామర్‌ వస్తుందనీ, మాతృభాషలో అంత గొప్ప లక్షణం ఉందన్నారు. 
 
మాతృభాషలో విద్యాబోధన జరిగితే ఆలోచనలు విస్తరిస్తాయన్నారు. మాతృభాష పునాదుల మీద ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చని తెలిపారు. అమెరికాలో ఉంటున్న తెలుగువారంతా మాతృభాషలో విద్య అభ్యసించిన వారేనని చెప్పారు. గొప్పస్థాయిలో, స్థితిలో ఉన్నవారందరూ మాతృభాషలో చదువుకున్నవారేనని గుర్తుచేశారు. 
 
భాషతోనే సంస్కృతి అలవడుతుందన్నారు. పరభాష కళ్లజోడు లాంటిదని, మాతృభాష రెండు కళ్లు వంటివని అభివర్ణించారు. కళ్లు లేకుండా అద్దాలు పెట్టుకోవటం ఎందుకని అన్నాదురై అనేవారని చంద్రబోస్‌ గుర్తుచేశారు. అన్నిభాషా సంస్కృతుల గాలులు ధారాళంగా ఇంట్లోకి వీచేలా కిటికీలు తీయాలని, కానీ.. ఆ గాలి తాకిడికి కొట్టుకుపోకుండా జాగత్త్ర పడదామని విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పేర్కొన్నారని చంద్రబోస్ చెప్పుకొచ్చారు.