శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 జులై 2020 (12:55 IST)

మీసాలు మెలేయడం వీరత్వమే.. కానీ, ఇది మాస్కులు ధరించే కాలం : చిరంజీవి

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం, ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం ప్రభుత్వాలు, స్వచ్ఛంధ సంస్థలు, సినీ సెలెబ్రిటీలు తమకు తోచిన విధంగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా, సినీ హీరోలు స్వయంగా ముందుకు వచ్చి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే పలువురు హీరోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరో వీడియోను తీశారు. యువ నటుడు కార్తికేయతో కలిసి తీసిన ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీసాలు మెలేయడం వీరత్వమే.. కానీ, ఇపుడు మాస్కులు ధరించడం వీరుడి లక్షణం అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించే చర్యల్లో భాగంగా, చిరంజీవి మరో వీడియోను విడుదల చేశారు. ఇందులో మాస్కుల ప్రాధాన్యత గురించి ఆయన తనదైన శైలిలో వివరించే ప్రయత్నం చేశారు.
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్ ఈ నెల 13న ఓ విషయాన్ని తెలిపారని ఆయన అన్నారు. కరోనా విపత్కర పరిస్థితులు మరింత పెరిగిపోతాయని చెప్పారని చిరు గుర్తుచేశారు. దీన్ని అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి ప్రబలకుండా తమ వంతు కృషి చేయాలని, కరోనా సంక్రమణకు ముగింపు పలకాలని చెప్పారని చిరు తెలిపారు.
 
'అందుకే, మాస్క్ తప్పనిసరిగా ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడండి.. ప్లీజ్' అని చిరంజీవి ట్వీట్ చేశారు. 'మీసాలు మెలేయడం వీరత్వమే.. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు ముఖానికి మాస్కులు ధరించడం వీరుడి లక్షణం' అని పేర్కొంటూ, ఆయన మాస్కులు తప్పనిసరిగా ధరించాలని వీడియో రూపంలో సందేశం ఇచ్చారు. యంగ్‌ హీరో కార్తీకేయతో కలిసి ఆయన చేసిన ఈ వీడియో మంచి సందేశాత్మకంగా ఉంది.