బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (18:22 IST)

కబీర్ సింగ్‌పై సెన్సార్ సీరియస్.. డాక్టర్లను కించపరిచేలా వున్నాడు..

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, కియారా అద్వాని హీరో హీరోయిన్లుగా నటించిన సందీప్ వంగా బాలీవుడ్ డెబ్యూ ఫిలిం కబీర్ సింగ్ సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతోంది. ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లో చేరింది.


దాని జోరును ఇంకా కొనసాగిస్తోంది. కానీ బాక్స్ ఆఫీస్ వసూళ్ళతో సంబంధం లేకుండా విమర్శలు కూడా తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. బాలీవుడ్ క్రిటిక్స్ చాలా మంది ఈ సినిమాపై విమర్శలు గుప్పించారు. 
 
సెన్సార్ బోర్డు సభ్యురాలు వీణా టిక్కూ కూడా రీసెంట్‌గా కబీర్ సింగ్‌పై మండిపడ్డారు. తాజాగా ఒక కేసు కూడా ఈ సినిమాపై నమోదైంది. ఈ సినిమాలో హీరో షాహిద్ మద్యానికి బానిసైన సర్జన్‌గా నటించాడు.

డ్రగ్స్‌కు ఎడిక్ట్ అయినట్లుగా కూడా కనిపిస్తాడు. ఈ హీరో పాత్ర పవిత్రమైన వైద్య వృత్తిని అవమానించేలా ఉందని, ఇలా డాక్టర్లను కించపరిచే సినిమాను ప్రదర్శనకు అనుమతించరాదని కోరుతూ ఒక డాక్టర్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇలాంటి సినిమాల వలన వైద్యులపై ప్రజలకు ఉన్న నమ్మకం సడలిపోయే అవకాశం ఉందని ఆయన అందోళన వ్యక్తం చేశారు. 
 
ఈ సినిమాను నిషేధించాలని కోరుతూ కేంద్ర వైద్యశాఖ మంత్రి, సమాచార ప్రసార శాఖా మంత్రి, సెన్సార్ బోర్డుకు కూడా లేఖ రాసినట్టుగా ఆయన వెల్లడించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డికి రీమేక్‌గా తెరకెక్కిన కబీర్ సింగ్ రిలీజ్ అయిన రోజు నుండి ఏదో ఒక రూపంలో చర్చనీయాంశం అవుతోంది.

అయితే ఈ విమర్శలు, కేసులు అన్నీ కబీర్ సింగ్‌పై క్రేజ్‌ను మరింతగా పెంచుతున్నాయి. ఫుల్ రన్‌లో ఈ సినిమా 200 కోట్ల మార్కును దాటేస్తుందనే అంచనాలు ఉన్నాయి.