శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 సెప్టెంబరు 2020 (14:54 IST)

ప్రభాస్ మూవీకి దిగ్గజ దర్శకుడి క్రియేటివ్ గైడెన్స్...

టాలీవుడ్ హీరో ప్రభాస్ హీరోగా మహానటి ఫేం నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఓ సోషియో ఫాంటసీ చిత్రం తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మించే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
అయితే, ఈ చిత్రానికి క్రియేటివ్ హెడ్ తరహాలో ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు తన అమూల్యమైన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సోమవారం అధికారికంగా వెల్లడించింది. 
 
సోమవారం దర్శకుడు సింగీతం జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైజయంతీ మూవీస్ సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విషయాన్ని ప్రకటించింది. ''మా చిరకాల స్వప్నం ఈ రోజు నెరవేరుతోంది. మా ఎపిక్‌లోకి సింగీతంగారిని ఆహ్వానిస్తున్నందుకు ఎంతో అనుభూతి చెందుతున్నాం. ఆయన సృజనాత్మక శక్తులు మాకు ఖచ్చితంగా మార్గనిర్దేశం చేస్తాయి" అంటూ వైజయంతీ మూవీస్ పోస్ట్ పెట్టింది.
 
కాగా, సింగీతం శ్రీనివాస రావు గతంలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా, విశ్వన నటుడు కమల్ హాసన్ నటించిన 'విచిత్ర సోదరులు', 'పుష్పక విమానం', నందమూరి బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369', 'భైరవద్వీపం' వంటి క్లాసిక్స్ మూవీలను తెరకెక్కించారు. అందుకే ఆయనకు అటు తెలుగు, ఇటు తమిళ చిత్ర పరిశ్రమల్లో ప్రత్యేక గుర్తింపువుంది. ఈ కారణంగానే ప్రభాస్ మూవీకి సింగీతం క్రియేటివ్ గైడెన్స్‌ హెడ్‌గా పని చేయనున్నారు.