1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 మే 2023 (14:44 IST)

సిద్ధూ వైపే మొగ్గుతున్న కాంగ్రెస్ అధిష్టానం... రేపు ప్రమాణ స్వీకారం

dk - siddha
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించింది. ఈ నెల 13వ తేదీ ఫలితాలు వెల్లడికాగా, కాంగ్రెస్ పార్టీ 224 సీట్లకు గాను ఏకంగా 137 సీట్లను కైవసం చేసుకుంది. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థిని మాత్రం ఖరారు చేయలేకపోతుంది. పార్టీలో ఇద్దరు బలమైన నేతలు ఈ పదవి కోసం పోటీపడుతుండంతో ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై కాంగ్రెస్ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌లలో ఎవరిని ఎంపిక చేస్తారన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. 
 
అయితే, గత నాలుగు రోజులుగా హస్తిన వేదికగా జరిపిన చర్చల్లో సీఎం అభ్యర్థి ఎంపికపై అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడినట్లు తెలుస్తోంది. ముందుగా ఊహించినట్లుగానే సీనియర్‌ నేత సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపినట్లు సమాచారం. సుదీర్ఘ మంతనాల తర్వాత.. సీఎం పగ్గాలను సిద్ధూకే అప్పగించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పార్టీ దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈ సాయంత్రం ప్రకటన చేసే అవకాశముంది. గురువారం ఆయన నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
 
అదేసమయంలో బుధవారం ఉదయం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో సిద్ధరామయ్య మరోసారి భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు చర్చించిన తర్వాత 10 జన్‌పథ్ నుంచి సిద్ధూ వెళ్లిపోయారు. అనంతరం కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌‌తోనూ రాహుల్ సమావేశమయ్యారు. పార్టీ వ్యూహాలపై ఆయన డీకేతో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు డిప్యూటీ సీఎం బాధ్యతలను తీసుకునేలా డీకేను రాహుల్‌ ఒప్పిస్తున్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రిత్వ శాఖలను కూడా శివకుమార్‌కు అప్పగించే అవకాశాలున్నాయి.
 
అన్ని అనుకున్నట్లు జరిగితే.. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య మే 18వ తేదీన (గురువారం) మధ్యాహ్నం 3.30 గంటలకు కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఆయనకు అధికారులు ప్రొటోకాల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు సిద్ధూ ఇంటి వద్ద కూడా భద్రతను పెంచారు.