గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By శ్రీ
Last Modified: శనివారం, 25 జులై 2020 (13:32 IST)

మంచిర్యాల టూ అమెరికా, సింగరేణి బిడ్డ ఘనత

ఓ వైపు కోవిడ్ ప్రభావం, మరోవైపు విద్యావ్యవస్థలో గందరగోళం ఉన్నప్పటికీ తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ స్టూడెంట్స్ తమ సత్తా చాటుతున్నారు. మొన్న సూర్య దీపిక నేడు సుహర్ష ప్రతిష్టాత్మక అమెరికా యూనివర్సీటీ ఆఫ్ అబర్న్‌లో ఎం.ఎస్సీ సీటు సాధించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఫారెస్ట్ కాలేజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న వీరిద్దరికీ ఈ గొప్ప అవకాశం వచ్చింది.
 
గతంలో సూర్య దీపిక, ఎంఎస్సీ ఫారెస్ట్ జెనటిక్స్‌లో సీటు సాధించింది. ఇప్పుడు సుహర్ష ఎం.ఎస్సీ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో రెండేళ్ల కోర్సును ఎంపికైంది. ట్యూషన్ ఫీజు రెండేళ్లకు కలిపి 30 వేల డాలర్లు యూనివర్సిటీ మినహాయింపును ఇచ్చింది. దీనితో పాటు 1500 డాలర్ల స్కాలర్‌షిప్‌ను కూడా రెండేళ్ల పాటు ఆఫర్ చేసింది. ఈ మొత్తం సుమారు 50 లక్షలు కానుంది.
 
అబర్న్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్‌ ఫారెస్టీ అండ్ వైల్డ్ లైఫ్ బయాలజీ డీన్‌గా ఉన్న జానకిరాం రెడ్డి అవలపాటి సహకారంతో వీరిద్దరూ సీటు సాధించారు. సుహర్ష మంచిర్యాలకు చెందిన వారు. ఆమె తండ్రి సింగరేణి కాలరీస్‌లో పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తనకు ఈ అవకాశం రావటం చాలా ఆనందంగా ఉందని, కాలేజీలో అనువైన వాతావరణం, ఫ్యాకల్టీ ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని సుహర్ష తెలిపారు.
 
గతంలో చేసుకున్న ఒప్పందం ఆధారంగా ఫారెస్ట్ కాలేజీ అధ్యాపకులకు బ్రిటిష్ కొలంబియా యూనివర్సీటీ, కెనడా రెండు విడతల్లో ట్రైనింగ్ ఇచ్చింది. కోర్సు, సెలబస్, టీచింగ్ పద్దతులు, పరిశోధన విభాగాల్లో శిక్షణ ఇచ్చారు. ఫైనల్ ఇయర్‌లో మొత్తం 49 మంది స్టూడెంట్స్ ఉంటే, అందులో 31 మంది అమ్మాయిలే. మరో ఆరుగురు విద్యార్థినులు ఫారెస్ట్ రీసెర్చ్ యూనివర్సీటీ డెహ్రాడూన్లో వుడ్ టెక్నాలజీలో ఎం.ఎస్సీ చేసేందుకు సిద్దమౌతున్నారు.
 
తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని తొలిసారిగా ఎంట్రెస్ టెస్ట్ కేంద్రాన్ని కూడా హైదరాబాద్ నిర్వహించేందుకు నిర్ణయం జరిగింది. ఫైనల్ ఇయర్‌లో ఉన్న మరో 20 మంది సివిల్ సర్వీసు పరీక్షలు రాసేందుకు సిద్దమవుతున్నారు. స్వయంగా కాలేజీ డీన్ చంద్రశేఖర రెడ్డి వారిని ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ ముఖ్యంగా ఫారెస్ట్ కాలేజీ నుంచి జాతీయస్థాయి ప్రతిభతో అధికారులుగా ఎంపిక కావాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు కాలేజీ స్థాపన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ స్థాయి వసతులు ములుగు క్యాంపస్‌లో కల్పించారని డీన్ తెలిపారు.