శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (19:31 IST)

ఆరోగ్యకరమైన అల్పాహారం.. జొన్నపిండితో దోసెలు ఎలా చేయాలంటే?

జొన్నల్లో ప్రోటీన్లు, ఫైబర్ అధిక మొత్తంలో లభిస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు ఈ జొన్నలని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జొన్నలు త్వరగా ఆకలి కాకుండా చూస్తాయి. జొన్న సంకటి, జొన్న రొట్టెలు లాంటివి చేసుకుని తినేవారు. అందువల్ల అప్పట్లో ఎక్కువమంది వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండేవారు. 
 
ప్రస్తుత కాలంలో సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోకపోవడం వల్ల అనేక రకములైన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే జొన్నల్ని ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు అందడంతో పాటు అనారోగ్యాలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి జొన్నలతో ఆరోగ్యకరమైన అల్పాహారం.. జొన్న దోసెలను ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
జొన్నపిండి - రెండు కప్పులు
మినపపప్పు - వంద గ్రాములు 
ఉప్పు -తగినంత
నూనె - తగినంత
 
తయారీ విధానం: మినపపప్పు నాలుగైదు గంటలు నానిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. అవసరమైతే కాసింత బియ్యం పిండిని కూడా చేర్చుకోవచ్చు. రుబ్బిన మినపప్పు పిండికి జొన్న పిండిని చేర్చి జారుగా కలుపుకోవాలి. 
 
ఈ పిండిని కాలిన పెనం మీద దోసెలు వేసుకోవాలి. తగినంత నూనె చేర్చుకోవాలి. ఈ జొన్న దోసెలు తయారీకి నువ్వుల నూనె, నెయ్యిని కూడా వాడుకోవచ్చు. అలా ఇరువైపులా కాలిన దోసెల్ని ప్లేటులోకి తీసుకుని.. టమోటా చట్నీ లేదా కొబ్బరి చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.