1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 28 ఫిబ్రవరి 2019 (13:23 IST)

ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటే ఇదేనేమో...

ఎల్ఐసీ... జీవిత బీమా పాలసీదారులు ఎవరైనా దురదృష్టవశాత్తూ మరణించినపక్షంలో వారి కుటుంబ సభ్యులకి ఒక నిర్దిష్ట మొత్తాన్ని అందజేసి ఆదుకోవాలనే మహోన్నత ఆశయంతో ప్రారంభించబడిన సంస్థ. అయితే దానిలో కూడా కొంత మంది పెద్ద మనుషులు పాలసీదారులని మోసం చేసి ఎక్కువ మొత్తాలు కట్టించుకోవడం వంటి సంఘటనలు జరుగుతుంటాయి. మనం వింటూనే ఉన్నాం. కానీ కోదాడలోని ఎల్‌ఐసీ శాఖలోని కొందరు ప్రబుద్ధులు మరో అడుగు ముందుకేసి పాలసీదారులు బ్రతికి ఉండగానే వారి పేరిట తప్పుడు మరణ ధృవీకరణ పత్రాలు పుట్టించేసి దాదాపు రూ.2 కోట్ల పరిహారాన్ని కొల్లగొట్టేసారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తక్కువకాలం వాయిదాలను కట్టి ఆర్థికభారంతో మధ్యలోనే పాలసీలను వదిలేసిన వ్యక్తుల వద్ద నుండి కొందరు ఏజెంట్లు ఒరిజినల్‌ బాండ్‌ పత్రాలను సేకరించి వారి పేరిట తప్పుడు మరణధృవీకరణ పత్రాన్ని పుట్టించేసి, తమ బంధువుల బ్యాంకు ఖాతాలను సమకూర్చి క్లెయిమ్‌లు దాఖలు చేసేసేవారు. పత్రాలు కార్యాలయానికి వచ్చిన తర్వాత క్లెయిమ్‌ల విభాగంలో హయ్యర్‌ గ్రేడ్‌ అసిస్టెంటు బీబీ నాయక్‌ మిగిలిన తంతు పూర్తి చేసేవాడు. బీమా సొమ్మును చెల్లించాల్సిన అధికారులు సంబంధిత ఉద్యోగిపై నమ్మకంతో సంతకాలు చేశారు. ఇలా ఒకే యేడాది దాదాపు 30 మందికి చెందిన క్లెయిమ్‌లు స్వాహా అయ్యాయని గత డిసెంబరులో జరిగిన సంస్థ అంతర్గత ఆడిట్‌లో తనిఖీ బృందం గుర్తించింది. 
 
వేర్వేరు వ్యక్తులకు చెందిన క్లెయిమ్‌ల సొమ్ము పదేపదే ఒకే ఖాతాలో జమ అయినట్లు గుర్తించిన కొందరు ఉద్యోగులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఉన్నతాధికారులు ఆరా తీయగా, రఘుచారి అనే ఏజెంట్ ఏకంగా తానే మరణించినట్లు పత్రాలు సృష్టించి రూ.9 లక్షలు కాజేసినట్టు గుర్తించారు. ఈ సొమ్ము అతని భార్య పేరిట ఉన్న ఆంధ్రాబ్యాంకు ఖాతాలో చేరింది. హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్ బీబీ నాయక్ కూడా‌.. తన బంధువు పేరిట ఎల్‌ఐసీ ఏజెంటుగా వ్యవహరించి పలువురితో పాలసీలు చేయించి వీటిల్లోనూ దాదాపు 10 మంది పాలసీలను నకిలీ పత్రాలతో క్లెయిమ్‌ చేసుకున్నట్లు విచారణలో తేలింది.