శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 22 జులై 2019 (18:33 IST)

ఏపీలో బిగ్ బాస్-3 ప్రసారాలు నిలిపివేస్తారా? బీజేపీ ఏమంటోంది?

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 సీజన్ ఆదివారం నుంచి ప్రారంభమైనప్పటికీ వివాదాలకు మాత్రం ఫుల్‌స్టాప్ పడట్లేదు. ఇప్పటికే ఈ షోను ఆపేయాలని కొందరు.. సినిమా మాదిరిగానే ప్రతి ఎపిసోడ్‌ను సెన్సార్ చేయాలని కోరుతూ ప్రముఖ దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 
 
మరోవైపు తమను కంటెస్టెంట్లుగా ఫైనల్ చేసి.. చివరికి మోసం చేశారని యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్తా కోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపి షోను అడ్డుకోవడానికి.. నిర్వాహకులను అరెస్ట్ చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. కానీ, ఇక్కడితో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుందనుకుంటే మరింత ముదిరింది. 
 
పర్మిషన్ రద్దు చేయండి!
తాజాగా ఈ వివాదంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "బిగ్ బాస్-సీరీస్‌పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ షో భారతీయ సంప్రదాయాలకు, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించి యువతను పక్కదారి పట్టించేలా ఉంది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ షో ప్రసారం కాకుండా పర్మిషన్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అని కన్నా కోరారు. 
 
ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరికీ ట్యాగ్ కూడా చేశారు. మొత్తానికి చూస్తే ఇప్పటి వరకూ ఈ వివాదంలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారే ఉండగా.. తాజాగా రాజకీయ నేతలు సైతం ఎంటరయ్యారన్న మాట. అయితే ఈ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎలా స్పందిస్తారో..? కన్నా ట్వీట్‌కు ఏమని రియాక్ట్ అవుతారో..? వేచి చూడాల్సిందే మరి.