శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (05:57 IST)

రైతులకు బేడీలు వేయడం తప్పే: నందిగం సురేశ్

రైతులకు బేడీలు వేయడం ముమ్మాటికీ తప్పేనని బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. దళిత రైతులకు బేడీలు వేయడంపై రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. దళితులంతా ఒక్కటేనని.. చంద్రబాబు మాయలో పడొద్దుని వ్యాఖ్యానించారు.

దళితుల జీవితాలతో టీడీపీ నేతలు ఆడుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాజధాని రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బేడీలు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రైతులకు బేడీలు వేయడం రాజకీయంగా తీవ్ర దుమారాన్నే లేపింది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది వైసీపీ సర్కార్. సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకున్నారు. నందిగం సురేష్ మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..
 
1. అమరావతి రైతులకు బేడీలు వేశారంటూ మాట్లాడుతున్నారు, మూడు రాజధానులకు మద్దతుగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మద్దతుగా, అమరావతిలో ఇళ్ళ పట్టాల కోసం వచ్చిన వారిని అడ్డుకుని, వారిమీదకు ట్రాక్టర్లు ఎక్కించి తొక్కించేందుకు ప్రయత్నం చేశారు. తప్పు ఎక్కడ జరిగినా తప్పే అయితే,  దాడులకు పాల్పడిన వాళ్ళని అమరావతి రైతులని, దళితులని చంద్రబాబు, టీడీపీ నేతలు నానాయాగీ చేస్తున్నారు.
 
2. దళిత మేధావులు అని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు చంద్రబాబు తొత్తులుగా మాట్లాడుతున్నారు, మరి వారు ఇదే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు హయాంలో అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతమైనప్పుడు వీరంతా ఎక్కడికి పోయారు, మరి ఆ రోజు వీరంతా దళితులు కాదా?

చంద్రబాబు దుర్మార్గాలకు ఇబ్బందులు పడ్డ వ్యక్తులు దళితులు కాదా, స్వయంగా నన్ను అరెస్ట్‌ చేసి  48 గంటలపాటు నానా హింసలు పెట్టినప్పుడు ఈ దళిత మేధావులంతా ఏమయ్యారు, నేనూ దళితుడినే కదా, ఒక్కరైనా వచ్చి పరామర్శించారా..?
 
3. నేను ఎంపీ అయిన తర్వాత కూడా నాపై దాడులు చేశారే, ఏకంగా ఇంటికొచ్చి దాడిచేసే ప్రయత్నం చేశారు కదా, ఇవన్నీ మీకు కనిపించడం లేదా..? ఒక ఎంపీ మీద దాడికి ప్రయత్నిస్తే మీరు మాట్లాడకుండా ఇక్కడేదో అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు. దాడిచేసిన వారు ఎలాంటి భాష వాడారో, ఎలాంటి బూతులు మాట్లాడారో నేను వినిపించడానికి సిద్దం. 
 
4. చంద్రబాబు తన సామాజిక వర్గం వారిని, టీడీపీ వారిని అడ్డుపెట్టుకుని పోరాటం చేయవచ్చు కదా, దళితులను ముందు పెట్టి, దళితుల భుజల మీద తుపాకీ పెట్టి మీరు ఎందుకు కాల్చాలనుకుటున్నారు, దళితుల జీవితాలతో ఆడుకోవడం ఎందుకు.? దళితుల కళ్ళను దళితులతోనే పొడిపించాలని చూస్తున్న చంద్రబాబు ఎంత దుర్మార్గుడో ఇప్పటికైనా దళిత సమాజం అర్థం చేసుకోవాలి.  అమరావతి రైతుల పేరుతో ఈ నాటకాలు ఎందుకు...?

చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటనకు వస్తే ఏ దళితుడో దాడి చేస్తే వదిలేస్తాడా, తప్పు ఎవరు చేసినా ఒకటే...బేడీలు వేశారని ముఖ్యమంత్రికి తెలిసిన మరుక్షణమే చర్యలు తీసుకున్నారు. వెంటనే పోలీసులను సస్పెండ్‌ చేశారు. చంద్రబాబుకు ఇప్పుడు రైతులపై ప్రేమ పుట్టుకొచ్చింది. బషీర్‌బాగ్‌లో రైతుల గుండెల్లో తూటాలు దించారు, ఇసుక దోపిడిని అడ్డుకుంటున్నారని తొక్కించి చంపారు, ఇవన్నీ మర్చిపోయారా చంద్రబాబూ..!
 
5. ఇక్కడ జరుగుతున్నది ఒకటి, టీడీపీ చెప్తుంది మరొకటి. జగన్‌ సీఎం అయిన తర్వాత దళితులకు, పేదలకు 54 వేల ఇళ్ళ పట్టాలు ఇస్తామంటే అడ్డుకున్న మీరు ఇప్పుడు నీతులు చెబుతారా..? ఈ దళిత మేధావులంతా చంద్రబాబుకు తబలా బృందంలా మారిపోయారు. ఇది దళితులకు అండగా నిలిచే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మాది అని ఈరోజు దళితులు చెప్పుకుంటున్నారు. దళితులకు ఏ కష్టం వచ్చినా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంగానీ, నాయకులుగానీ అండగా ఉంటాం. అది మా భాద్యత.
 
6. చంద్రబాబు తన బుద్ధి మార్చుకోవాలి. దళితులను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. చంద్రబాబు కుట్ర సిద్ధాంతం వల్ల ఇప్పుడు నష్టపోయింది మా దళిత సోదరులే. చంద్రబాబు, టీడీపీ నేతలు, వారి బినామీలు అమరావతిలో వందల కోట్లు గడించాలి.

మా దళితులు మాత్రం ముందుండి పోరాడాలా, కేసులు పెట్టించుకుని జైళ్ళకు వెళ్ళాలా..? వందల కోట్ల ఆస్తులు మీవి.. మా వాళ్ళు మాత్రం రోడ్లెక్కి ధర్నాలు చేయాలా...?  చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తన దాయాదులను పక్కనపెట్టుకుంటారు, ఓడిపోగానే దళితులు, బీసీలను అడ్డుపెట్టుకుంటాడు.
 
7. చంద్రబాబు అమరావతి రైతుల జీవితాలతో ఆడుకున్నాడు, వారిని నిండా ముంచింది చంద్రబాబే. అమరావతిలో గ్రాఫిక్స్ చూపించి రియల్‌ ఎస్టేట్‌ దందా కాకుండా ఇంకేమైనా చేశారా చెప్పండి. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్, భూ స్కాంలపై  ఏ విచారణకైనా చంద్రబాబు సిద్దమంటాడు, విచారణ ప్రారంభించగానే కోర్టులకెళ్ళి స్టేలు తెచ్చుకుంటాడు. ఇదెక్కడి సంస్కృతి. తప్పు చేయకపోతే విచారణ అంటే ఎందుకు భయం..? 
 
8. రాష్ట్రంలోని బీసీలు, మైనార్టీలు, దళితులు వీరంతా కలిసి తనను ఓడించారు కాబట్టి, వీరి జీవితాలతో ఆడుకోవాలి అని చంద్రబాబు అనుకుంటున్నాడు. వీరు బాగుపడకూడదు, వీరికి ఇళ్ళు రాకూడదు, దళితులు ఎప్పటికీ పాలేర్లుగానే ఉండాలి అనేది చంద్రబాబు ధోరణి. వీరి జీవితాలు బాగుపడుతున్నాయి కాబట్టి వీరిలో వీరికి గొడవలు పెట్టాలి అనేది చంద్రబాబు ఆలోచన. గొడవలకేమో దళితులు కావాలా.. మీ సామాజికవర్గాన్ని పంపించవచ్చు కదా..? 
 
9. ఇకనైనా దళిత జాతి బిడ్డలారా ఆలోచించండి. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవాల్సిన అవసరం లేదు, మన బతుకులు మార్చడానికి జగన్‌ సిద్దంగా ఉన్నారు,  కేసుల విషయంలో ఇబ్బందులు ఎదురైతే సాయం చేయడానికి సిద్దంగా ఉన్నాం. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయి ఇబ్బందులు తెచ్చుకోవద్దు, తప్పు ఎవరు చేసినా ఒకటే, ఈ ప్రభుత్వంలో ఎక్కడ అన్యాయం జరిగినా, దళితులపై దాడులు జరిగినా వెంటనే కేసులు పెడుతున్నారు.
 
10. ఏ స్ధాయిలోనైనా సరే ఈ రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేయడానికి జగన్‌ ప్రభుత్వం సిద్దంగా ఉంది. చంద్రబాబు కుయుక్తులకు దళితులు బలికావద్దు. రాజధాని ప్రాంతంలో నేను ఉండకూడదని టీడీపీ నేతల అంటున్నారు, నేను చంద్రబాబు తొత్తులా మారాలా లేక చంద్రబాబు జేబులో పెన్నులా మారాలా, మేం ఉంటే మీ ఆటలు సాగవని మీరు భయపడుతున్నారా..? 
 
11. చంద్రబాబు ట్రాప్‌లో పడవద్దు.  చంద్రబాబు చెప్పిన ఏ తప్పును ప్రోత్సహించకండి. మూడు రాజధానులకు మద్దతుగా దీక్ష చేస్తుంటే మీకు వచ్చిన నష్టమేంటి..?  రాజధానిలో పేదలకు ఇళ్ళిస్తే మురికికూపంగా మారుతుందన్న వారి మాటలు నమ్మద్దు.  నేను రాజధాని ప్రాంతంలోనే ఉంటాను. మీ సమస్య ఏది ఉన్నా తీర్చడానికి సీఎం సిద్దంగా ఉన్నారు, కాబట్టి చంద్రబాబు లాంటి క్రిమినల్‌ను నమ్మి మోసపోవద్దు.
 
12. చంద్రబాబు కుమారుడు లోకేష్ పెద్ద అయోమమం మాషారు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలీదు. ట్రాక్టర్‌ నడపడం రానివాడు రాష్ట్రాన్ని నడిపిస్తాడట, మన బతుకులు మారుస్తాడట. లోకేష్‌ గురించి మాట్లాడడం సుద్ద దండగ.