1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (22:21 IST)

అక్టోబరు నుంచి మారనున్న ఆటో డెబిట్ రూల్స్.. ఏంటవి?

చాలామంది బ్యాంకు ఖాతాదారులు విద్యుత్‌, వాట‌ర్‌, గ్యాస్ బిల్లుల‌తోపాటు నెల‌వారీ రుణ వాయిదాలు, బీమా ప్రీమియంలు, మొబైల్ రీచార్జి, ఇంట‌ర్నెట్ స‌ర్వీసెస్ త‌దిత‌ర సేవ‌ల‌ చార్జీల‌పేమెంట్స్‌ను ఆటో డెబిట్ విధానంలో చెల్లిస్తుంటారు. ఈ ఆటో డెబిట్ నిబంధనలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మారనున్నాయి. ఖాతాదారుల భద్రత, పేమెంట్స్ సజావుగా సాగేందుకు వీలుగా భారతీయ రిజర్వు బ్యాంకు ఈ కొత్త తరహా విధానానికి శ్రీకారం చుట్టింది. 
 
కానీ అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి ఈ లావాదేవీల‌ను జ‌రుప‌డానికి ఖాతాదారుల నుంచి అడిష‌న‌ల్ ఫ్యాక్ట‌ర్ అథంటికేష‌న్ (ఏఎఫ్ఏ) అంటే ధ్రువీక‌ర‌ణ పొందాల‌ని ఆర్బీఐ గతంలోనే ప్రకటించింది. అయితే, ఈ కొత్త నిబంధన మేరకు రూ.5000 దాటిన ప్ర‌తి పేమెంట్‌కు వ‌న్‌టైం పాస్‌వ‌ర్డ్ (ఓటీపీ) త‌ప్ప‌నిస‌రి చేసింది.
 
తొలుత ఈ నిబంధ‌న‌ను 2019 డిసెంబ‌ర్ 31 నుంచి అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించినప్పటికీ ఇండియ‌న్ బ్యాంక్స్ అసోసియేష‌న్ అభ్య‌ర్థ‌న మేర‌కు గ‌డువును పొడిగించింది. దీని ప్ర‌కారం గ‌త ఏప్రిల్ నుంచి అమ‌లులోకి రావాల్సి ఉంది. అప్పటికి కూడా చాలా బ్యాంకులు తమ బ్యాంకింగ్ ఆన్‌లైన్ వ్యవస్థను మెరుగుపరుచుకోలేదు. దీంతో గడువు పెంచాలని కోరడంతో ఈ నెలాఖరు వరకు పొడగించారు. దీంతో కొత్త విధానం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకిరానుంది. ఈ విధానాన్ని పాటించని బ్యాంకులపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆర్బీఐ హెచ్చరించింది.