గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 3 జులై 2021 (15:00 IST)

కెఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జులై 11 నుంచి

కోనేరు లక్ష్మయ్య - కెఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ,  హైదరాబాద్ క్యాంపస్‌లలో ఇంజనీరింగ్, కోర్సులలో ప్రవేశానికి నిర్వహించిన KLEEE-2021 పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.

యూనివర్సిటీ ఇంచార్జి ఉప కులపతి డాక్టర్ ఎన్‌.వెంకట్రామ్, కన్వీనర్ డాక్టర్ రామకృష్ణ, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు, మేనేజ్‌మెంట్ హ్యుమానిటీ సైన్సెస్ విభాగం డైరెక్టర్ డాక్టర్ ఎం.కిషోర్‌బాబు శనివారం విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో ఫలితాలను  విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకట్రామ్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం ఈ ఏడాది 40 వేలకు మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాసారని, పరీక్షలో ఉతీర్ణులైన వారికీ ర్యాంకులు కేటాయించినట్లు చెప్పారు. ఇంజనీరింగ్‌తో పాటు కె.ఎల్ విద్యా సంస్థలో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కింద అందించే అన్ని కోర్సులకు ఈ నెల 11వ తెదీ నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఏడాది రూ.100 కోట్ల వరకు విద్యార్థులకు స్కాలర్ షిప్ కింద కేటాయించినట్లు తెలిపారు. జేఈఈ మెయిన్స్‌లో 96 పర్శంటేజ్ అంతకన్నా ఎక్కువ  వచ్చిన వారికి స్కాలర్ షిప్ కింద  ఫీజులో పూర్తి రాయితీ ఇస్తున్నామని అలాగే  ఇంటర్ మార్కుల్లో మెరిట్ మార్కులు వచ్చిన వారికి వారు ఎంచుకున్న ఇంజనీరింగ్ విభాగం ఆధారంగా ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తూ వారికి మెరిట్ స్కాలర్ షిప్  ప్రకటించారు.

కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థుల మెరిట్ మార్కులు, ర్యాంకులను పరిశీలించి స్కాలర్ షిప్ కింద వారి ఫీజుల్లో మినహాయింపు ఇస్తామని చెప్పారు. కౌన్సిలింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు, తల్లిదండ్రుల‌కు రవాణా సౌకర్యంతో సహా, ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా అమలుచేస్తున్నట్లు స్పష్టం చేశారు.
 
యూనివర్సిటీ అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు మాట్లాడుతూ, తమ యూనివర్సిటీ అందించే ఇంజనీరింగ్ కోర్సులతో పాటు అన్ని రకాల కోర్సుల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షలకు ఆంధ్రప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 40 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారని, ఈ ఏడాది మెరిట్ విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, అత్యంత విలువైన స్కాలర్షిప్ విధానాన్ని సిద్ధం చేసినట్లు చెప్పారు. పరీక్ష ఫలితాలతో పాటు కౌన్సిలింగ్ షెడ్యూల్, కోర్సుల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామ‌న్నారు.